Rice Millers:స్వేచ్ఛ బ్యూరో: మిర్యాలగూడ మిల్లర్లు సిండికేట్ గా మారి రైతన్నల కష్టాన్ని దోచేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోలులో … మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లర్లు ముందు వరుసలో ఉంటుండగా రైతులకు గిట్టుబాటు ధరకు మించి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అనేక కొర్రీలతో అన్నదాతకు ఆవేదనను మిగులుస్తున్నారు. రైతును నమ్ముకున్న అన్ని వ్యాపార వర్గాలు లాభాల బాటలో నడుస్తుండగా.. వరి పండించే అన్నదాత మాత్రం గిట్టుబాటు కు మించ ధరను దక్కించుకోలేకపోతున్నాడు.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర, జాతీయ రహదారులపై, పట్టణ కేంద్రానికి సమీప పల్లెల్లో మిల్లులను ఏర్పాటు చేసిన వ్యాపారులు పొల్యూషన్ నిబంధనలు పాటించకపోవడంతో.. భూగర్భ జలాలతోపాటు వాయు కాలుష్యం జరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగా…. రైతులకు సరైన ధరలు రాక మరోవైపు నష్ట పోతున్నారు. జనాలకు కాలుష్యాన్ని బహుమతిగా ఇస్తున్న మిల్లర్లు అదే మిల్లులో ఏసీ గదుల్లో ఉంటూ.. దుమ్ము ధూళి పడకుండా ఖరీదైన కార్లలో తిరుగుతూ కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తూ రైతన్నలకు మొండి చేతులు చూపెడుతున్నారు.
మిల్లర్లు సీజన్ ప్రారంభంలో క్వింటాళ్లకు రూ. 2800 నుంచి 2700 చెల్లించిన మిల్లర్లు ఇప్పుడు రూ. 2400 మాత్రమే చెల్లిస్తూ అన్నదాత కష్టాన్ని గుర్తించడం లేదు. గిట్టుబాటు ధరకు మించి క్వింటాళ్లకు రూ. 100 నుంచి 200 ఎక్కువగా వస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్న రైతన్నకు మిల్లర్ల నుంచి నిరాశ ఎదురవుతోంది. సీజన్ మొదట్లో ఇచ్చినట్లుగానే ధాన్యానికి ధర చెల్లిస్తే ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కుతుందని అన్నదాతలు చెబుతున్నారు.
Also read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎట్టకేలకు తెరుచుకున్న చలివేంద్రం
మిర్యాలగూడ పరిధిలో రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్న అన్నదాతలు సీజన్ ప్రారంభంలో ఇచ్చిన ధరలు చెల్లించడం లేదని… ధాన్యం క్వాలిటీ గా ఉన్న కేవలం క్వింటాళ్లకు రూ. 2400, 2450 చెల్లిస్తున్నారని పలువురు రైతుల ద్వారా శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి రాగా పలు మిల్లులో పర్యటించిన ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ప్రస్తుతం ధరలు చెల్లించాలని అన్నదాతలకు భరోసాగా ఉండాలని మిల్లర్లను కోరారు.
ఇప్పటికే రైస్ మిల్లర్లతో కాల్ కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ నిర్వహించి రైతులు తెచ్చిన ధాన్యానికి ధరలో చెల్లించే విషయంలో అన్యాయం చేయొద్దని ఆదేశించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి. రైతులు వివిధ ప్రాంతాల నుంచి మిల్లులకు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలను వేగంగా పరిశీలించి సత్వరమే దిగుమతి చేసుకొని అన్నదాతలకు మిల్లర్లు సహకరించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో గంటల తరబడి దగ్గర వేచి చూడటం ఇబ్బందికరంగా మారిందని మిల్లర్లు జాప్యం చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Also read: కేంద్రమంత్రి గడ్కరీతో డీకే అరుణ భేటీ.. అభివృద్దికి భారీ స్కెచ్!