Jangaon Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: జనగామ జిల్లాలో మద్యం మాఫియా పడగవిప్పుతోంది. నిబంధనలు గాలికి ఎగిరిపోతుంటే, బెల్ట్ షాపులు ఊరూరా సామ్రాజ్యాలుగా విస్తరిస్తున్నాయి. బచ్చన్నపేట మండల కేంద్రం మొదలుకొని మారుమూల పల్లెల వరకు ‘బెల్ట్’ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన మద్యం దుకాణాల కంటే ముందే, తెల్లవారుజామున 4:30 గంటలకే బెల్ట్ షాపులు వినియోగదారులకు ‘స్వాగతం’ పలుకుతుండటం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా మారుతోంది.
వైన్స్ షాపుల్లో వినియోగదారులు అడిగే పాపులర్ బ్రాండ్లు ముఖ్యంగా KF లైట్ బీర్ స్టాక్ లేదని చెపుతున్న యజమానులు, లోపాయికారిగా ఆ స్టాక్ను బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు.సిండికేట్ మాయాజాలం: వైన్స్లో ₹180 ఉండాల్సిన మద్యం, బెల్ట్ షాపుల్లో ₹220కి విచ్చలవిడిగా అమ్ముతున్నారు.
అదనపు వసూళ్లు: ఒక్కో బాటిల్పై ₹20 నుండి ₹40 వరకు అదనంగా దండుకుంటూ సామాన్య కూలీల శ్రమను దోచుకుంటున్నారు.
ఇటీవల జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ అక్రమ దందాలపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. “కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నిబంధనలు తుంగలో తొక్కడం దారుణం. పర్మిట్ రూముల పేరుతో సాగుతున్న అరాచకాలను అరికట్టాలి” అని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయకపోతే, దళిత మహిళా సంఘాలను ఏకం చేసి రోడ్డెక్కుతామని అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: మురిసిన బాల్యం.. సందడిగా అంగన్వాడీ ప్రీ-స్కూల్ మేళా!
జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మద్యం విచ్చలవిడితనం వల్ల పనిపాటలు వదిలేసి తెల్లవారుజాము నుంచే మద్యానికి బానిసవుతున్న యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
సంపాదనంతా మద్యం పాలవ్వడంతో పల్లెల్లో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
గ్రామస్తులందరూ కలిసి గ్రామ సభలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఊరిలో బెల్ట్ షాపు నడిపితే జరిమానా వేయడం లేదా వారిని సామాజికంగా నిలదీయడం వంటి చర్యలు గతంలో కొన్ని గ్రామాల్లో సక్సెస్ అయ్యాయి. బెల్ట్ షాపుల దగ్గర గొడవలు జరుగుతున్నా, అక్రమంగా మద్యం నిల్వ చేసినా ప్రజలు భయపడకుండా ఎక్సైజ్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలి. అధికారులు ఎన్ని దాడులు చేసినా, రాజకీయ నాయకులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మార్పు రానంత కాలం ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం. గ్రామాల్లో మహిళా సంఘాలు నిఘా ఉంచాలని, అక్రమ ధరలకు మద్యం అమ్ముతున్న చోట కొనుగోలు చేయబోమని ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన వారం రోజుల గడువు ముగుస్తోంది.. మరి బచ్చన్నపేటలో, జనగామలో అధికారుల లాఠీలు గర్జిస్తాయా? లేక మామూళ్ల మత్తులో ఈ దందా ఇలాగే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
Also Read: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రాజమండ్రి–విశాఖ డబుల్ లైన్ కు గ్రీన్ సిగ్నల్!