Drug Death Case: ప్రిస్క్రిప్షన్ లేకున్నా మత్తు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు యథేచ్ఛగా విక్రయిస్తున్న అక్రమ ఔషధ మాఫియా ఇప్పుడు మరోసారి బయటపడింది. గతంలోనే బిగ్ టీవీ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ అక్రమ వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకురాగా, తాజాగా చంద్రయాణగుట్టలో జరిగిన ఇర్ఫాన్, జంగిర్ మృతి ఘటన ఈ అక్రమ డ్రగ్ విక్రయాలను మరోసారి స్పష్టంగా చూపించింది. ఈ కేసులో పోలీసులు వారి స్నేహితుడు ఫాయిస్ను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణ అనంతరం ఫాయిస్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. ఇర్ఫాన్, జంగిర్ ఇద్దరే ‘అట్రానియం’ ఇంజెక్షన్ తీసుకున్నారని, తాను తీసుకోలేదని స్పష్టంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ఇంజెక్షన్లు ఎక్కడ కొనుగోలు చేశారన్న అంశంపై ఫాయిస్కు స్పష్టమైన సమాచారం లేదని వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత వారు గాఢ నిద్రలోకి వెళ్లారని చెప్పిన ఫాయిస్, తనకు ఏ స్థాయిలో తెలియదని వాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అట్రానియం డ్రగ్పై ఉన్న బ్యాచ్ నెంబర్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ కేసును కేంద్రంగా చేసుకొని మత్తు ఇంజెక్షన్ల సరఫరా ముఠా ఎవరు, విక్రయదారులు ఎక్కడ ఉన్నారు, ఏ మెడికల్ షాపుల నుంచి ఈ డ్రగ్స్ బయటకు వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్దస్థాయి డ్రగ్ మాఫియా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మరోవైపు బిగ్ టీవీ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు అమ్ముతున్న షాకింగ్ నిజాలు వెలుగుకి వచ్చాయి. మార్కెట్లో కొన్ని ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఔషధ విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. లైసెన్స్ ఉన్న ఫార్మసిస్టు లేకుండానే మెడికల్ షాపులు నడుస్తున్న వైనాలు కూడా బయటపడ్డాయి.
అంతేకాకుండా, లైసెన్స్ ఒకరిదైతే షాప్ను రన్ చేసేది మరొకరు అన్న అక్రమ విధానం కూడా సాధారణంగా మారిపోయిందన్న ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు ఫార్మా ప్రతినిధులు నేరుగా షాపులకు వెళ్లి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందులు విక్రయించేందుకు ప్రోత్సహిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విధానాల వల్ల యువత డ్రగ్ మత్తుకు బానిసలుగా మారి, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం డ్రగ్ అనే మాటే వినిపించకుండా చేయాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తుండగా, మరోవైపు డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం మెడికల్ మాఫియాపై సమర్థవంతంగా పనిచేయడం లేదన్న విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అక్రమంగా మందులు అమ్మే షాపులపై తనిఖీలు అరుదుగా జరగడం, పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టడంతో పాటు, సంబంధిత మెడికల్ షాపులు, ఫార్మా సరఫరాదారులపై నిఘా పెంచారు. అట్రానియం డ్రగ్ సరఫరా వెనుక ఉన్న ముఠాను పట్టుకునే దిశగా విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసు ద్వారా అయినా అక్రమ డ్రగ్ విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని, బాధ్యులపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.