Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుండి జోగుళాంబ గద్వాల జిల్లాకు టిప్పర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం గద్వాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, సదరు వాహనాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
Also Read: BRS తోక పార్టీ TRS.. కవిత కొత్త పార్టీపై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు
కర్నూల్, మంత్రాలయం మరియు రాయచూరు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున టిప్పర్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. ఇంత బహిరంగంగా అక్రమ రవాణా జరుగుతున్నా.. జిల్లా మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు లేని ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, భారీ వాహనాల రాకపోకలతో పట్టణ రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రాజకీయ నవశకం.. కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు