Illegal Construction: అండ బలం, అర్థ బలం, రాజకీయ ప్రాబల్యం ఉంటే ఎంతటి అక్రమాన్ని అయినా కప్పి వేయవచ్చు. నిబంధనలను తోసి రాజీ ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు. ఇందుకు మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అరుణా గోదాం నిర్మాణంను నిదర్శనంగా చెప్పవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండా, చెరువు బఫర్లో నిర్మిస్తున్న గోదాం గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆ యజమాన్యం వెనుక అధికారం పార్టీ నేతల అండ ఉండడంతో అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ఎఫ్టిఎల్ ను ఆక్రమించి ప్రహరీ నిర్మాణం, బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టి, నీటి వనరులు భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు, టౌన్ ప్లానింగ్ విభాగానికి చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించినా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మరి ఎక్కువలో ఎక్కువ నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు. ఇలా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు.
Also Read: డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!
ఈ విషయమై అధికారులను వివరణ కోరితే నోటీసులు ఇచ్చాం, పనులు నిలిపి వేయించాం, నిబంధన ప్రకారం చర్య తీసుకుంటాం అని సమాధానం ఇస్తున్నారు. ఆరు నెలల కిందట వెళ్లి వివరణ కోరితే ఇదే మాట, ఇప్పుడు వెళ్లి వివరణ కోరిన ఇదే మాట చెబుతున్నారు. అంతేగాని గడ్డపారతో ఒక సిమెంట్ ఇటుకను కూడా తొలగించడం లేదు. ఇలా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరోక్షంగా యాజమాన్యానికి సహకరించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి గోదాం నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని, తద్వారా చెరువు ఉనికిని కాపాడాలని కోరుతున్నారు.
Also Read: Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!