రాష్ట్రంలోని బీజేపీలో ఇంటిపోరు నడుస్తున్నట్టు తెలుస్తున్నది.మొన్నటివరకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ నెలకొనగా.. ఇప్పుడు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను అడ్డుతొలగించుకోవడానికి కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వలస నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తున్నది. కేంద్రంలో పదవుల కోసం లేదా రాష్ట్రంలో నాయకత్వ పదవులపై ఆశలు పెట్టుకున్నవారికి అధిష్టానం మొండిచేయి చూపించగా వారంతా నారాజ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న రాంచందర్ రావుకు బీజేపీ పగ్గాలు అప్పగించడంతో మరోసారి పార్టీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముందు నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేశారని పేరుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నా..గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా నాటి పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలుమార్లు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారని ఓ దశలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నియామకం సమయంలోనూ పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశం ఇవ్వాలని పలుమార్లు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తీరా రాంచందర్ రావు స్టేట్ చీఫ్గా నియామకం అవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దాంతో కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పార్టీ లైన్ దాటినందుకు ఆయన్ను సస్పెండ్ చేయగా.. ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మరల ఎన్డీయే సర్కారు రావడంతో తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఆయన ఆశలు అడియాశలయ్యాయి. కనీసం స్టేట్ చీఫ్ పోస్టు అయినా తనకు వస్తుందని ఆశించారు.అదికూడా రాలేదు.దీంతో ఆయన నాటి నుంచి పార్టీలో సైలెంట్ అయ్యారు. అయితే, ఆయన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ బెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.తన వెంట వచ్చిన కేడర్కు ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రయారిటీ ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు.దీనికి తోడు మరో కేంద్రమంత్రి బండి సంజయ్.. తన పాత నియోజకవర్గం హుజురాబాద్లో ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు తన కేడర్కు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొలిటికల్ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి సినిమాలు కలిసి రావడం లేదా ?
తాజాగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ.. ఎంపీ ఈటల రాజేందర్.. బీజేపీకి రాజీనామా చేస్తున్నారని.. త్వరలోనే వేరే పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై ఆయన సీరియస్ అయ్యారు.పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత సులభం కాదని మండిపడ్డారు. తన మీద పిచ్చి ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కొందరు కావాలనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈటలకు, బీజేపీలోని ముఖ్య నేతలకు పొసగడం లేదని.. అందుకే ఆయన్ను వెళ్లగొట్టేందుకు పొగపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.