అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇప్ప సారా పంచాయితీ తెరమీదకు వచ్చింది. దీనిపై అధికార పార్టీ ప్రతిపాదన చేయగా.. ప్రతిపక్ష బీజేపీ చేసిన కామెంట్స్ అధికార పార్టీ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అంతగా కమలం పార్టీ నేతలు ఏమన్నారు. వారికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు సైలెంట్గా మద్దతు పలికారు? ఇదే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించాయి. వారి ప్రయత్నాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గట్టిగానే
తిప్పికొడుతున్నట్టు తెలిసింది. ఇప్ప సారా తయారీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించారు. దానిపై లోతుగా చర్చ జరగాలని, ఆ తర్వాత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేసి కార్యాచరణ ప్రకటిస్తున్నదని అసెంబ్లీలో చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇప్పసారా తయారీకి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు సైతం అందుకు మద్దతు ఇస్తామని బీజేపీ, బీఆర్ఎస్ కూడా ప్రకటించాయి. ఎందుకంటే దీని తయారీ వలన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కల్తీ కల్లు మహమ్మారిని తరిమేయొచ్చని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో ఇప్ప సారా తయారు చేస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించినట్టు అవుతుందని.. దీనికి తోడు ఆదాయం కూడా పెరుగుతుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పసారా తయారీకి మద్దతు ప్రకటిస్తూనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ స్థాయిలో స్పందించారు. ఇప్పసారాకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ’ పేరు పెట్టొద్దని పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించడంపై అసెంబ్లీలో నిన్న ఉదయం గందరగోళం నెలకొన్నది. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. సభలో లేని మహానేత గురించి ఇలా ఎలా మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆ వెంటే మంత్రి శ్రీధర్ బాబు సైతం పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: మాటల్లోనే కాదు.. పాటలోనూ ఫైర్.. బండి సంజయ్ పాడిన పాట నెట్టింట వైరల్!
పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని..ఆయన ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం బీజేపీ పార్టీ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేయగా.. బీజేపీ లీడర్లు మాత్రం పట్టించుకోలేదు.ఇక బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో సైలెంట్గా ఉండిపోయింది. పరోక్షంగా కమలం పార్టీకి వారు మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్, ఇందిరమ్మ పేరిట మాత్రమే స్కీమ్స్ రన్ అవుతున్నాయని.. అన్నింటికీ వారిపేర్లే ఎందుకు అని కాషాయ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిచింది. ఇదే అంశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగింది.