AV Ranganath: నగరంలోని బతుకమ్మకుంట అభివృద్ధి పట్ల స్థానిక ప్రజలు, వాకర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం సాయంత్రం బతుకమ్మ కుంటను సందర్శించి, అక్కడ వాకింగ్ చేస్తున్నవారితో కలిసి నడిచారు. ఈ అభివృద్ధి పనుల వల్ల వారికి కలుగుతున్న ప్రయోజనాలు, వారి అభిప్రాయాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కమిషనర్ బతుకమ్మకుంట చుట్టూ వాకర్లతో కలసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన చెరువును ఎంత మంది ఉపయోగించుకుంటున్నారు, పరిసర ప్రాంత ప్రజలకు ఇది ఎంత మేర ఉపయోగపడుతోందని వివరాలు అడిగారు. స్థానికులు ఉల్లాసంగా స్పందిస్తూ, బతుకమ్మకుంట ఇప్పుడు తమకందరికీ విహార కేంద్రంగా మారిందని కమిషనర్ శ్రీ రంగనాథ్ గారికి చెప్పారు. ఈ చెరువు అభివృద్ధి చెందకముందు ఈ పరిసరాలు దుర్గంధంతో నిండిపోయేవని, దీనివల్ల వ్యాధులు కూడా ప్రబలేవని వారు గుర్తు చేసుకున్నారు.
కానీ, హైడ్రా చొరవతో బతుకమ్మ కుంట అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోయాయని, తాము క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నామని వాకర్లు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇది పిల్లలకు మంచి క్రీడా స్థలంగా మారిందని వారు తెలియజేశారు.
బతుకమ్మకుంటను సెప్టెంబర్ 28న ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. చెరువు చుట్టూ నాటిన మొక్కలు పెద్దవైతే, పరిసరాలు మరింత ఆరోగ్యవంతంగా మారుతాయని, ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చెరువును ఎప్పుడూ ఇంతే శుభ్రంగా ఉంచుకునే బాధ్యతను హైడ్రాతో కలిసి అక్కడి వాకర్లు, స్థానికులు తీసుకోవాలని కమిషనర్ రంగనాథ్ కోరారు.
కమిషనర్ ఆకస్మిక సందర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన స్థానికులు, ఆయనతో ఉత్సాహంగా ఫోటోలు దిగి తమ జ్ఞాపకాలను పదిలపరచుకున్నారు. చిన్నారులు సైతం దగ్గరకి వచ్చి “థాంక్ యూ సార్” అంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కుకృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పట్ల స్థానికుల సంతృప్తి కమిషనర్ పనులకు లభించిన అభినందనగా చెప్పవచ్చు.