బీఆర్ఎస్ పార్టీలో మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన ప్రజాఉద్యమం మీద చర్చ ఊపందుకున్నది. ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడిన సమయంలో 15 రోజుల్లో ప్రజాఉద్యమంపై కార్యచరణ ప్రకటిస్తామని.. కృష్ణా నదీ పరివాహాక జిల్లాల్లో మూడు బహిరంగ సభలు నిర్వహిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రకటించగా కొత్త సంవత్సరం రావడమే గాక సంక్రాంతి పండుగ కూడా సమీపించింది. తీరా చూస్తే ఈ నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ సభల నిర్వహణ, ప్రజాఉద్యమంపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో అసలు కార్యక్రమం ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేకెత్తుతున్నట్టు కేడర్లో చర్చ జరుగుతున్నది.తమ సమస్యలు,నదీ జలాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభలో మాట్లాడుతుందనుకుంటే కేసీఆర్ ఫౌంహౌస్కే పరిమితం అయ్యారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఒక్క రోజు సెషన్లో పాల్గొని సభను బాయ్ కాట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చర్యతో ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్లినట్టు కిందిస్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం. అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదని కేడర్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ, గ్రామస్థాయిలో బీఆర్ఎస్కు పట్టు ఏమాత్రం పోలేదని కేసీఆర్ సైతం ఉటంకించారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడమే ఇందుకు కారణం.ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. అయితే, అసెంబ్లీని బహిష్కరించడం వలన మూటగట్టుకున్న నెగెటివిటినీ ప్రజాఉద్యమం, సభలు నిర్వహించి కేసీఆర్తో మాట్లాడిస్తే మరల పొగొట్టుకున్న పాజిటివిటిని దక్కించుకోవచ్చని కిందిస్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Telangana Politics: గులాబీ బాస్కు సొంత కూతురే.. రివర్స్ గేర్
పదిహేను రోజుల్లో సభలు నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్.. అసలు దాని కార్యచరణ రూపొందించారా? ఇది సరైన సమయం కాదని భావిస్తున్నారా? అనేది తెలియరావడం లేదు. రాష్ట్రస్థాయి నేతలు సైతం దీనిపై పెద్దగా స్పందించకపోవడంతో అసలు ప్రజాఉద్యమం ఉంటుందా?ఉండదా? అని గులాబీ నాయకులు, శ్రేణులు డైలమాలో ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికల ముందు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో కేసీఆర్ నిర్వహిస్తానని చెప్పిన సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే హైదరాబాద్ నగరానికి కొద్దిపాటి దూరంలో ఉన్న ఈ మూడు జిల్లాల్లో మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురువేయొచ్చని జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సలహా ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఒకవేళ కేసీఆర్ ఈసారి బయటకు రాకపోతే సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ఆస్కారం లేకపోలేదని కూడా వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కేడర్, జిల్లా నేతల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా కేసీఆర్తో త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.