Jaggareddy: సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను గుర్తు చేస్తూ ప్రత్యర్థులకు ఘాటు సమాధానం ఇచ్చారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ వయసెంత? కాంగ్రెస్ పార్టీ వయసెంత? బీజేపీకి కేవలం 40 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 140 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది అంటూ వ్యాఖ్యానించారు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రపై అప్పటికి పుట్టని వాళ్లు విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. మీ అమ్మానాన్నలను అడిగితే వారు కాంగ్రెస్ చరిత్ర చెబుతారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి నాయకులు దేశానికి చేసిన సేవలను మీ చెవిలో దేవుళ్లలా చెప్పుకుంటారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
దేశం కోసం మీరు చేసింది శూన్యమని, కానీ బీజేపీ నేత లక్ష్మణ్ దగ్గరే మూడు కంటే ఎక్కువ పదవులు ఉన్నాయని విమర్శించారు. పదవులు కావాలనే రాజకీయాలు చేసే వాళ్లు, దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఎలా విమర్శిస్తారు? అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తులు ధారాదత్తం చేసిందని గుర్తు చేస్తూ, అటువంటి త్యాగ కుటుంబంపై విమర్శలు చేసే నైతిక హక్కు బీజేపీకి గానీ, బీఆర్ఎస్కి గానీ లేదని స్పష్టం చేశారు.
దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. నెహ్రూ హయాంలో బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వంటి అనేక కీలక సంస్థలు ఏర్పడ్డాయి. రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో ఐటీ రంగానికి పునాది పడింది. ఈరోజు భారత్ ఐటీ హబ్గా ఎదిగిందంటే దానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే అంటూ ఆయన కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు.
రాజకీయాల్లో నారాజ్ అనే పదానికి తాను పూర్తిగా వ్యతిరేకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో అలిగిన వాడు ఎప్పుడూ జీవితంలో రాజకీయ నాయకుడు కాలేడు. నేను నారాజ్ అయ్యే అంత వీక్ రాజకీయ నాయకుడిని కాదు. సమస్య వస్తే ఎదుర్కోవాలి, ఓటమి వస్తే స్వీకరించాలి ఇదే అసలైన రాజకీయ జీవితం అంటూ తన తత్వాన్ని ఆయన వివరించారు.
సంగారెడ్డి జిల్లా ప్రజలపై కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు నాకు ఎంతో మంచి అవకాశాలు ఇచ్చారు. నేను నా శక్తి మేరకు ప్రజాసేవ చేశాను. ప్రజలతో ఉన్న అనుబంధం నాకు ఎప్పటికీ గర్వకారణమే అని భావోద్వేగంగా అన్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా నిర్మల నిర్ణయం కరెక్ట్ అని తాను భావిస్తున్నానని తెలిపారు. అందుకే నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉండను అని స్పష్టంగా ప్రకటిస్తున్నాను అంటూ సంచలన ప్రకటన చేశారు.
Also Read: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో
ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా ప్రజలకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంత తొందరగా తన పోటీపై క్లారిటీ ఇచ్చానని ఆయన వివరణ ఇచ్చారు. ప్రజలను అయోమయంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. రాజకీయ భవిష్యత్తు గురించి ప్రజలకు ముందే స్పష్టం చేయడం నా బాధ్యతగా భావించాను అన్నారు.