Jagtial District: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కన్నకొడుకే కాలయముడై.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన తల్లిదండ్రులను నడిరోడ్డుపైకి నెట్టేశాడు. బాధితులు బద్దం అనంతరెడ్డి, చంద్రమ్మ దంపతులు తమ కుమారుడు కృష్ణారెడ్డి పెడుతున్న వేధింపులు భరించలేక.. న్యాయం కోసం జగిత్యాల ఆర్డీఓను ఆశ్రయించారు.
బాధితుల సమాచారం ప్రకారం.. తమ పేరిట ఉన్న అర ఎకరం భూమిని కుమారుడు కృష్ణారెడ్డి తన అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. అయితే.. గత కొంతకాలంగా అనంతరెడ్డి దంపతులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం కనికరం కూడా చూపకుండా.. ఆస్తి చేజిక్కించుకున్నాక వారిని కొట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్లగొట్టాడు. తమ గోడును ఆర్డీఓ ముందు వివరిస్తూ ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఆర్డీఓ.. కుమారుడు కృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరే ప్రయత్నం చేశారు. అయితే అతను స్పందించకపోవడంతో అధికారుల తీరు కఠినమైంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ.. తల్లిదండ్రులు , వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం కింద కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసే వారికి ఈ చర్య ఒక హెచ్చరికగా నిలిచింది.
ALSO READ: బళ్లారిలో హై టెన్షన్.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు