జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా శనివారం భారీ ఉద్రిక్తతకు వేదికైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
నిరసన ప్రదర్శన, తోపులాట
యూత్ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి, రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది.
కాంగ్రెస్ నాయకుడికి గాయం
ఈ తోపులాటలో నియంత్రణ తప్పి ఓ కాంగ్రెస్ నాయకుడు కింద పడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. తమ నాయకుడిపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆగ్రహించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ చౌరస్తాలోనే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రస్తుతం జనగామ పట్టణంలో భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, లోలోపల ఉద్రిక్తత కొనసాగుతోంది.
ALSO READ: Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్చల్, టెంపుల్లో నమాజ్ చదువుతుండగా..?