Online Services: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు, సిబ్బందికి అందించే పరిపాలనా సేవలను మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులు, ఎన్ఓసీ, ఇతర ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్లైన్ మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు.
టెస్టింగ్తో సహా అన్ని పనులు జూన్ 12 లోపు పూర్తి చేసి అన్ని ఆన్లైన్ మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆ తేదీ తర్వాత మాన్యువల్ సర్వీసులు నిలిపివేయబడతాయని స్పష్టంచేశారు. ఉపాధ్యాయుల నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగనుంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎటువంటి మాన్యువల్ దరఖాస్తులను ఇకపై అంగీకరించబోయేది లేదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఉపాధ్యాయుల కోసం సుదీర్ఘ కాలపు సెలవులు, ఫిర్యాదుల పరిష్కార వేదిక, క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక మాడ్యూళ్లను రూపొందిస్తున్నారు.
Also Read: ఫలితాల వేళ మమతా బెనర్జీ సంచలన వీడియో.. తుది ఫలితాలు మారుతాయంటున్న దీదీ
అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలపై తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు, వాటిపై తీసుకున్న చర్యలను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సేవలన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారిక పోర్టల్ telangana.gov.in తో అనుసంధానిస్తున్నారు. వీటి పనితీరును ప్రతి శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు బీటెక్ విద్యార్హత కలిగిన ఇద్దరు లేదా ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులను రెండు నెలల కాలానికి విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 లోపు ఈ పనులన్నీ పూర్తి చేసి, ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు.
Also Read: హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్.. నగరంలో సంచలనం.. అసలేం జరిగింది?