జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అవినీతికి ఆలయంగా మారిందని విమర్శించారు. అభివృద్ధికి తానే అడ్డం పడుతున్నానన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. ‘జగిత్యాలలో నీ రాజ్యమే నడుస్తుంటే, నేను ఎందుకు అడ్డుపడతాను?’ అని సంజయ్ను ప్రశ్నించారు.
మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని జీవన్ రెడ్డి నిలదీశారు. జగిత్యాల మున్సిపల్ చరిత్రలో ఏకంగా 16 మంది కమిషనర్లు మారడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని, ఇది ఎమ్మెల్యే వేధింపులకు నిదర్శనమని మండిపడ్డారు. సంజయ్ పాలనలో ఎనిమిది మంది మున్సిపల్ అధికారులు జైలు పాలు కావడం, ఏసీబీ దాడులు జరగడం చూస్తుంటే పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతోందన్నారు. గతంలో చైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా చేయడానికి ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆయన గుర్తు చేశారు.
రోడ్ల విస్తరణ, కాంట్రాక్టర్ల అంశంపై స్పందిస్తూ.. గతంలో తానే యావర్ రోడ్డును 60 ఫీట్లకు పెంచి అభివృద్ధి చేశానని జీవన్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్లుల విషయంలో ఎమ్మెల్యేకు ఉన్న తపనపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ గౌరీ శంకర్ చుట్టమా? బిల్లులు రాకపోతే మార్కెట్ను స్వాధీనం చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
యావర్ రోడ్డులోని అక్రమ ఆక్రమణలను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్కు నివేదించానని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అలాగే మెడికల్ కళాశాలల ఏర్పాటులో యూనిఫాం డెవలప్మెంట్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.