Jeevan Reddy: జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడి బిఆర్ఎస్ (గులాబీ) గూటికి చేరినప్పటి నుండి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నటివరకు తన వెన్నంటి ఉన్న అనుచరులపైనే ఇప్పుడు ఆయన మాటల యుద్ధానికి దిగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
శిష్యులపైనే గులాబీ బాస్ ‘టాస్క్’
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తన అనుచరులైన అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి), మేడిపల్లి సత్యం (చొప్పదండి)లను భుజాలపై మోసి మరి గెలిపించుకున్నారు జీవన్ రెడ్డి. కానీ, ఆయన బిఆర్ఎస్లో చేరడమే ఆలస్యం.. గులాబీ బాస్ కేసీఆర్ ఆయనకు భారీ బాధ్యతలే అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలతో పాటు ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే పూర్తి బాధ్యత ఇప్పుడు జీవన్ రెడ్డి పైనే ఉంది. నిన్నటివరకు ఎవరి గెలుపు కోసమైతే చెమటోడ్చారో, ఇప్పుడు వారినే వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఆయన దూకుడు పెంచారు.
ఇసుక దందాపై సవాళ్లు..
తన శిష్యులే అయినప్పటికీ.. ప్రస్తుతం వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలను జీవన్ రెడ్డి గట్టిగా నిలదీస్తున్నారు. ముఖ్యంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్పై వస్తున్న ఇసుక అక్రమ దందా ఆరోపణలపై స్పందిస్తూ,‘నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు తప్పు అని నిరూపించుకో’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం మానసికంగా బాధ కలిగిస్తోందని ఒప్పుకుంటూనే.. రాజకీయంగా మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తన సొంత శిష్యులైనా సరే, రాబోయే ఎన్నికల్లో వారి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read: కారు మునిగిపోయింది.. ఇప్పటికైనా డ్రామాలు ఆపండి.. బీఆర్ఎస్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు!