Karnataka Dams: తుంగభద్రపై అక్రమంగా కర్నాటక ప్రభుత్వం డ్యామ్లు నిర్మిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని , ఫ్యూచర్లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల సందర్శనకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం ఆదివారం వెళ్లింది. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై అక్రమంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ గేట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. తెలంగాణలో నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. తుంగభద్రలో సిల్ట్ తీయక పూడికతో నిండిపోయిందని చెప్పారు. శ్రీశైలం నుంచి ఎప్పుడైనా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.
ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా తెలంగాణ ద్రోహిని నియమించారని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 10 శాతం పనులు పూర్తి చేయట్లేదన్నారు. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే మనకు నీళ్లు ఉండవని చెప్పారు. హైడ్రాలిక్ గేట్లు పెట్టి చుక్క నీరు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాలిక్ గేట్లు వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోతే పాలమూరు ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు వదలకపోతే పాలమూరు ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. తుంగభద్ర డ్యాంలో తెలంగాణకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. కనీసం 4 టీఎంసీల నీటిని కిందకు వదలాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇచ్చేవరకూ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
Also Read: కాంగ్రెస్ సర్కార్కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రతో మహబూబ్నగర్ జిల్లా ఎంతో నష్టపోయిందని తెలిపారు. నీళ్ల కోసమే ఉద్యమాలు జరిపి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంఅక్రమ ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. గేట్ల లీకుల ద్వారా వచ్చిన నీళ్లతోనే లక్ష ఎకరాలకు నీళ్లందేవని తెలిపారు.
ఇప్పుడు కర్ణాటక హైడ్రాలిక్ గేట్లు పెట్టి నీటిని వదలడం లేదని చెప్పారు. మహబూబ్నగర్కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లాకు కరువు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు నింపడం లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు. ఎల్నినోతో తీవ్ర కరువు వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని నీటి హక్కులను కాపాడాలని సూచించారు.
Also Read: ఖమ్మంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!