Kishan Reddy: స్వేచ్చ బ్యూరొో: కొమురవెల్లి భక్తుల సౌకర్యార్థం రూ.6 కోట్లతో ఆలయ వైభవం ప్రతిబింబించేలా ఆధునిక హంగులతో నూతన రైల్వే స్టేషన్ ను నిర్మించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ప్రతిపాదనల్లో కొమురవెల్లి లేనప్పటికీ, భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ ను నిర్మించినట్లు చెప్పారు. అలాగే మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే మార్గం ద్వారా కరీంనగర్కు కనెక్టివిటీ ఏర్పడిందని, ఇప్పటికే మనోహరాబాద్-సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గొల్ల, కురుమల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో నూతన రైల్వే స్టేషన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2024లో శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్ట్, మల్లన్న దయతో ఆదివారం సాకారమై లక్షలాది మంది భక్తుల కలను నెరవేర్చిందన్నారు. సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య నడిచే డెమూ రైళ్లు ఇకపై కొమురవెల్లిలో హాల్ట్ ఇస్తాయన్నారు. ఇవన్నీ అన్-రిజర్వ్డ్ కోచ్లే కావడం వల్ల చాలా తక్కువ చార్జీలతో(ఉదాహరణకు సికింద్రాబాద్-కొమురవెల్లికి కేవలం రూ.25) ప్రయాణం చేయవచ్చన్నారు. ఇది భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, స్థానిక వ్యాపారాన్ని పెంచుతుందన్నారు.
Also read: సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!
తెలంగాణలో రైల్వే అభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి-నిజామాబాద్, జగ్గయ్యపేట-విష్ణుపురం, భద్రాచలం-సత్తుపల్లి, దేవరకద్ర-కృష్ణ, అక్కన్నపేట-మెదక్ మధ్య 340 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణం పూర్తయిందన్నారు. కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులు తుది దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. బీబీనగర్-గుంటూరు, ముద్ఖేడ్-డోన్, భద్రాచలం-దోర్నకల్, మోతుమరి-విష్ణుపురం డబ్లింగ్ పనులు, నిజామాబాద్, నష్కల్-హసన్పర్తి రోడ్, విష్ణుపురం, పెద్దపల్లి, వికారాబాద్, పగిడిపల్లి ప్రాంతాల్లో బైపాస్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. స్వదేశీ సెక్యూరిటీ టెక్నాలజీ కవచ్.. తెలంగాణలో 63 స్టేషన్లు, 627 కిలోమీటర్ల మేర అమలవుతోందని తెలిపారు.
2014లో ఉన్న 121 అన్మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్లను 2018 నాటికే 100 శాతం తొలగించామని, అలాగే 249 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్లను దశలవారీగా తొలగించినట్లు స్పష్టంచేశారు. ప్రజల భద్రత కోసం 329 రోడ్ అండర్ బ్రిడ్జీలు, 59 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, 58 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 73 స్టేషన్లలో 88 స్టాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లయిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, నాగ్పూర్ నగరాలకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాల కోసం హైదరాబాద్ నుంచి 6 అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
Also read: PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!