జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో బీ-ఫామ్ ల పంచాయితీ మరోసారి ముదిరింది. గత కొద్ది రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు, నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి బహిర్గతమై అంతా హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ బీ-ఫామ్ వార్ మొదలవ్వడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
ముందుగా జరిగిన రాజకీయ చర్చల సారాంశం ప్రకారం.. సరిత తిరుపతయ్య వర్గానికి 7 వార్డుల్లో బి-ఫామ్ లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంగీకరించారు. దీంతో వివాదం సద్దుమణిగిందని కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించింది. ఎమ్మెల్యే వర్గీయులు అప్పటికే మొత్తం 37 వార్డులకు సంబంధించి బీ-ఫామ్ లను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. ఎమ్మెల్యే వర్గం ఇచ్చిన 37 బి-ఫామ్ లలో, సరిత వర్గానికి కేటాయించినట్లు చెబుతున్న 7 వార్డులు కూడా ఉన్నాయి. మరోవైపు, తమకు కేటాయించిన కోటా ప్రకారం సరిత వర్గీయులు కూడా అవే 7 వార్డులకు తమ బి-ఫామ్ లను అధికారులకు అందజేశారు. దీనివల్ల ఒకే వార్డు స్థానానికి ఇద్దరు వేర్వేరు అభ్యర్థులు ఒకే పార్టీ గుర్తుపై బి-ఫామ్ లు సమర్పించినట్లయింది.
ఒకే పార్టీ నుండి ఇద్దరికి బి-ఫామ్ లు రావడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల నిబంధనల ప్రకారం.. చివరి నిమిషంలో ఎవరి బి-ఫామ్ చెల్లుబాటు అవుతుంది? పార్టీ అధికారికంగా ఎవరిని గుర్తిస్తుంది? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పోలింగ్ కు ముందే సొంత పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని కిందిస్థాయి నాయకులు వాపోతున్నారు.
గద్వాల రాజకీయాల్లో ఈ బీ-ఫామ్ లొల్లి ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లా ముఖ్య నాయకులు జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే.. ఇది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి గద్వాల మున్సిపల్ పరిధిలో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది.