Hyderabad Crime: ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. అడుగుపెట్టిన ప్రతిచోటా మహిళలు ఏదొక రూపంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్న స్త్రీలకు పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఉద్యోగ రీత్యా బయటకెళ్లే అమ్మాయిలకు ఆఫీసులే రక్షణ కవచాలుగా ఉండాలి. కానీ.. దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల అవే వారికి నరకప్రాయంగా మారుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తోటి మహిళా ఉద్యోగులను లోబర్చుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు జూబ్లీహిల్స్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో స్వామి రెడ్డి అనే వ్యక్తి హెచ్ఆర్ (HR) మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సంస్థలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై అతను గత కొంతకాలంగా కన్నేశాడు. తనపై ఉన్న అధికారంతో ఆమెను లోబర్చుకోవాలని నిరంతరం వేధింపులకు గురిచేశాడు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, స్వామి రెడ్డి ఆమెను తనతో కలిసి పబ్ కు రావాలని, షికార్లకు రావాలని పదేపదే బలవంతం చేసేవాడు. నాతో ఎంజాయ్ చేయకపోతే నీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. గతంలో కంపెనీ తరపున వెళ్లిన ఒక ట్రిప్ సందర్భంలో కూడా ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
సదరు మేనేజర్ పెడుతున్న అనైతిక ప్రతిపాదనలను ఆ మహిళా ఉద్యోగి తీవ్రంగా నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న స్వామి రెడ్డి, ఆమెను వృత్తిపరంగా ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఆమెను తన పదవి నుండి డిమోట్ (Demote) చేయడమే కాకుండా, తోటి ఉద్యోగుల ముందు ఆమె క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడుతూ మానసిక వేదనకు గురిచేశాడు. పని చేసే చోట తన ఆత్మగౌరవానికి భంగం కలగడం, వేధింపులు మితిమీరిపోవడంతో బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మేనేజర్ స్వామి రెడ్డిపై వర్క్ ప్లేస్ హరాస్మెంట్ (POSH Act), ఇతర క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యాలయంలో మహిళా రక్షణకు సంబంధించి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ALSO READ: రంగనాథ్ యాక్షన్.. బంజారా హిల్స్ లో నీరూస్ షోరూమ్ సీజ్..!