Jupally Krishna Rao: స్వేచ్ఛ బ్యూరో: నవ భారత నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగజ్జీవన్ రామ్ కేవలం ఒక వర్గానికో, కులానికో పరిమితమైన నేత కాదని, దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ‘సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం’ అని నమ్మిన బాబూజీ, అంటరానితనం , కుల వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని అందించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
దేశాభివృద్ధిలో బాబూజీ పోషించిన కీలక పాత్రను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో ‘హరిత విప్లవం’ విజయవంతం కావడానికి, ఆహార ధాన్యాల కొరత తీర్చి దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. అలాగే, 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన ప్రదర్శించిన వ్యూహచతురతను గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన కనీస వేతనాలు, పీఎఫ్, బోనస్ చట్టాలు నేటికీ కోట్లాది మందికి రక్షణ కవచాలుగా ఉన్నాయని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఒక ఎత్తయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేట్ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడం మరో ఎత్తు అని మంత్రి పేర్కొన్నారు. అణగారిన వర్గాల యువత ఉన్నత చదువులు చదవడమే కాకుండా, కార్పొరేట్ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాబూజీ క్రమశిక్షణ, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్ఛా సమానత్వాలు వెల్లివిరిసే సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
Also Read: పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు!