Kadam Srihari: మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారో చెప్పాలని కడియం శ్రీహరి నిలదీశారు. జాతిపిత అని పిలవడానికి సిగ్గుండాలని.. అసలు కేసీఆర్ తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై స్పందించని వ్యక్తిని.. అసెంబ్లీకి రాని వ్యక్తిని జాతిపితగా ఎలా గుర్తిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం బాగుపడటం కంటే ఆయన కుటుంబమే ఆర్థికంగా బలపడిందని శ్రీహరి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఏదో ఒక స్కామ్లో చిక్కుకున్నారని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని.. భవిష్యత్ తరాలపై పెను భారం వేశారని మండిపడ్డారు.
ఇటీవల కేసీఆర్ ఉపయోగించిన భాషపై కడియం శ్రీహరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏమైనా నీ అయ్య సొత్తా? నీ అయ్య జాగీరా?’అంటూ ఘాటైన పదజాలంతో ప్రశ్నించారు. అధికారం కోల్పోయినప్పటికీ కేసీఆర్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని.. ప్రజలను గౌరవించడం ఆయనకు రాదని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ నాయకుడెలా అవుతారు?.. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత కేసీఆర్దే.. తెలంగాణ అంటే ఒకరి సొత్తు కాదు, ఇది ప్రజల పోరాట ఫలితం అంటూ ఘటా వ్యాఖ్యలు చేశారు.
కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) వైఖరిని.. కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారశైలిని ఆయన టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Also Read: ఖర్గే నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ.. రెండేళ్ల పాలనపై రాహుల్, ఖర్గే సమీక్ష!