Kaleshwaram Report: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు న్యాయపోరాటంగా మారింది. ఈ నివేదికను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, అలాగే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది.
హరీశ్ రావు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం తన వాదనలను బలంగా వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని ఆరోపించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం పీసీ ఘోష్ నివేదిక చెల్లదని ఆయన వాదించారు. చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఈ నివేదిక రూపొందించబడిందని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడానికి గల కారణాలను విశ్లేషించి.. అసలు ఏం జరిగిందనే అంశంపై నివేదిక ఇవ్వడమే కమిషన్ ప్రధాన బాధ్యతని సుందరం గుర్తుచేశారు. అయితే.. కమిషన్ ఆ పరిమితులను దాటి వ్యవహరించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ తన విధివిధానాలకు విరుద్ధంగా నివేదిక ఇచ్చింది కాబట్టి దానిని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.
ఈ కేసులో ఇతర పిటిషనర్ల తరఫున కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. ముఖ్యంగా కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపించనున్నారు. ప్రస్తుతానికి కోర్టు ఈ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఎల్లుండి జరగబోయే విచారణలో కేసీఆర్ తరఫు న్యాయవాది వినిపించే వాదనలు అత్యంత కీలకం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలు ,నిర్వహణలో కమిషన్ చేసిన వ్యాఖ్యలను వారు ఎలా తిప్పికొడతారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: హైదరాబాద్లో ఘోరం.. హోటల్ కార్మికుడిని కత్తులతో వేటాడి..!