Kalvakuntla Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్లోని లేక్ వ్యూ పార్క్లో ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్పై ఫూలే విగ్రహ ఏర్పాటు తమ సుదీర్ఘ పోరాటానికి దక్కిన పాక్షిక విజయమని అభివర్ణించారు. ఫూలే విగ్రహాన్ని కేవలం ట్యాంక్ బండ్కే పరిమితం చేయకుండా.. రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రతిష్టించాలని ఆమె బలంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కవిత తీవ్రంగా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని.. పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుల ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పరీక్షలను సైతం లెక్కచేయకుండా వరుస ఎన్నికలు నిర్వహిస్తూ.. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బడ్జెట్లో బీసీల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించి.. వాటిని చిత్తశుద్ధితో ఖర్చు చేయాలని కోరారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని.. అందుకే ప్రజలు విధిలేక కాంగ్రెస్కు ఓటేశారని విశ్లేషించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ జాగృతియే నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక అంశాలపై మాట్లాడుతూ.. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు అంగీకరించరని.. బలవంతంగా కాంగ్రెస్ తల్లి బొమ్మను రుద్దడం వినాశకాలానికి సంకేతమని విమర్శించారు. అలాగే.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ ఖర్చు మొత్తాన్ని జాగృతి భరిస్తుందని కవిత ప్రకటించారు.