Supreme Court: వివాహానికి ముందే ఇష్టపూర్వకంగా ఏర్పడే శారీరక సంబంధాలు (Pre-marital physical relationships) ఒక వ్యక్తి నైతికతను లేదా క్యారెక్టర్ను తప్పుబట్టడానికి ప్రాతిపదిక కాబోవని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మారుతున్న కాలం, మారుతున్న సామాజిక విలువలను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతీ బంధాన్ని పెళ్లితో ముడి వేయరాదన్న ధర్మాసనం.. వివాహం జరగనంత మాత్రాన ఒక పక్షం మరో పక్షాన్ని మోసం చేసిందన్న నిర్ధారణకు రాలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానం, వివాహానికి ముందు పెట్టుకున్న శారీరక సంబంధం కారణంగా 2014లో తెలంగాణ కు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి.. ట్రైనింగ్ దశలోనే తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతడిపై క్రిమినల్ కేసు నమోదై ఉన్నందున అతడి నియామకాన్ని తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ.. తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మోహన్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మసనం.. సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు అవివాహిత వయోజనులు తమ ఇష్టానుసారం సంబంధం కలిగి ఉండటాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
కేవలం ఒక సంబంధం పెళ్లితో ముగియలేదన్న కారణంతో ఒక పక్షం మరొక పక్షాన్ని మోసం చేసిందన్న నిర్ధారణకు రాలేమని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిపై ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేందుకు ఇది కారణం కాకూడదని, ఉండజాలదని స్పష్టం చేసింది. ప్రతి సంబంధం వివాహంతో ముగియదని మారుతున్న సామాజిక వాస్తవాల పట్ల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. కాబట్టి వారి సంబంధం పెళ్లితో ముగియలేదన్న ఒక్క కారణంతో ఒక పక్షాన్ని మరో పక్షం మోసం చేసిందని చేప్పేందుకు ఎలాంటి ప్రాతిపదక లేదని తీర్పులో పేర్కొంది.
బాధితుడు, ఫిర్యాదు దారు చాలా ఏళ్లుగా ఒకరికొకరు తెలుసని.. వారిద్దరు ఇరుగుపొరుగు వారని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహానికి ముందు శారీరక సంబంధాలు రోజు రోజుకు సర్వసాధారణంగా మారిపోతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. మరోవైపు బాధితుడి నైతిక విలువలను కొలమానంగా తీసుకొని.. కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేయడాన్ని ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దానిని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. అతడి ఎంపికను పునః పరిశీలించాలని తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుకు సూచించింది. దీంతో తన కానిస్టేబుల్ ఉద్యోగం కోసం సుదీర్ఘంగా పోరాడుతూ వస్తున్న.. గాజుల తిరుపతికి ఈ తీర్పుతో ఉపశమనం లభించినట్లైంది.
Also Read: ఏసీ + ఫ్యాన్ కాంబో.. కరెంటు బిల్లు దిగిరావాల్సిందే.. కూలింగ్ దుమ్ములేచిపోవాల్సిందే..!
గతంలో వివిధ న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకుంటే.. ఇద్దరు మేజర్లు తమ స్వంత ఇష్టంతో తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవించాలి. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగస్వామిని ఎన్నుకునే హక్కు కూడా ఉంది. బంధాలు తెగిపోయిన ప్రతిసారీ.. పగ తీర్చుకోవడానికో లేదా ఒత్తిడి తీసుకురావడానికో చట్టాలను ఆయుధంగా వాడుకోకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల విషయంలో మరోమారు సరికొత్త చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ప్రేమ, శారీరక సంబంధం, వివాహం వంటి అంశాలపై కోర్టులు మరింత ప్రాక్టికల్గా, ఆధునికంగా ఆలోచిస్తున్నాయనడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
Also Read: ఏసీ 24°Cలో పెట్టినా కరెంటు బిల్లు బాధిస్తోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే సరి!