తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తన తదుపరి కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పేరు.. కొత్త అజెండాతో తాము ప్రజల ముందుకు వస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అందుబాటులో ఉందని.. ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ చూపిన సిద్ధాంతాల మేరకే తమ భవిష్యత్తు ప్రస్థానం కొనసాగుతుందని వివరించారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్తలు ఎవరూ లేరంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఏకపక్షంగా 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు శాపంగా మారిందన్నారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న స్కూళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అధిక ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. సామాన్యుడిపై పడుతున్న ఈ అదనపు భారానికి ముకుతాడు వేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు.
రాజకీయ అంశాలతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం తాము పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం.. సిద్ధాంతాలకు కట్టుబడి తమ ప్రయాణం సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు కోసం అవసరమైతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ALSO READ: Congress : కేసీఆర్పై సీబీఐ విచారణ ఉన్నట్టా? లేనట్టా?