Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి , హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ బంజారాహిల్స్లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఇది కేవలం ‘ట్రైలర్’ మాత్రమే.. అసలు ‘సినిమా’ ముందుందని వారు ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కూటమి 40 స్థానాల్లో విజయం సాధించిందని కవిత తెలిపారు. ప్రజలు కొత్త రకమైన రాజకీయాలను కోరుకుంటున్నారని.. ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్కు ఓటు వేశారని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ పతనానికి నిదర్శనమని.. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని హితవు పలికారు.
మున్సిపల్ ఎన్నికలు బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ పొత్తుకు తొలిమెట్టు అని కవిత ఆరోపించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ గెలుపునకు సహకరించారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్తో చేతులు కలిపిన సీపీఐకి, బీఆర్ఎస్ బేషరతుగా మద్దతు ప్రకటించడం నయవంచన అని.. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో సీపీఐ చేసిన ఆరోపణలను ఇప్పుడు బీఆర్ఎస్ అంగీకరిస్తున్నట్లేనా అని ప్రశ్నించారు.
త్వరలోనే తెలంగాణ జాగృతి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని.. యువతకు, ఉద్యమకారులకు అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తాయని, కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని రియాజ్ అహ్మద్ తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తున్నా తమ అభ్యర్థులు లొంగలేదని.. వడ్డేపల్లి వంటి చోట్ల స్పష్టమైన తీర్పు వచ్చిందని అంబటి జోజిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా, సుభాషిజం సిద్ధాంతంతో ముందుకు సాగుతామని వారు వెల్లడించారు.