Resort Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా సాగుతున్న రిసార్ట్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. అధికార కాంగ్రెస్ తనకున్న 14 స్థానాలకు తోడు ఎక్స్ అఫిషియో ఓట్లు, ఇండిపెండెంట్ల మద్దతుతో పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోంది.
బలం నిరూపించుకునే వరకు తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీలు హైదరాబాద్లోని ఖరీదైన రిసార్టులను వేదికగా చేసుకున్నాయి. ముఖ్యంగా శామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రబిందువైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగారు. కార్పొరేటర్లతో విడివిడిగా భేటీ అవుతూ.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా తమ సంఖ్యాబలాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీగా క్యాంపులు నిర్వహిస్తోంది.
ఈ రాజకీయ చదరంగంలో స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారారు. వారి మద్దతు ఉంటేనే మేయర్ పీఠం దక్కుతుందనే పరిస్థితి ఉండటంతో.. వారి విలువ బంగారం ధరలా ఆకాశాన్ని తాకుతోంది. పార్టీల ఫిరాయింపులు, ప్రలోభాల నడుమ ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
హంగ్ ఏర్పడటంతో పార్టీ అగ్రనేతలకు తలనొప్పి మొదలైనా.. కార్పొరేటర్లు మాత్రం రిసార్టుల్లో విందులు, వినోదాలతో పండగ చేసుకుంటున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లు అధికార పార్టీకి ఆయుధంగా మారాయి. వ్యూహ ప్రతివ్యూహాలు ఒకవైపు నైతిక బలం, మరోవైపు అధికార బలం మధ్య పోరు సాగుతోంది.
మొత్తానికి కరీంనగర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రిసార్ట్ రాజకీయాల పర్వం ముగిసి.. ఓటింగ్ జరిగే వరకు ఈ ఉత్కంఠకు తెరపడేలా లేదు.