Karimnagar Corporation: కరీంనగర్ కార్పొరేషన్లో.. 8 నెలల క్రితం ఐదు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయింది. అయితే మొదటి నుంచీ.. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము అభివృద్ధికి దూరమవుతామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలుకావడంతో.. బాధిత గ్రామాల్లో ఆందోళన కనబడుతుంది. తాము పల్లె వాతావరణంలో జీవిస్తున్నా.. ఇప్పుడు నగరంలో కలుపడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్లో ఐదు గ్రామాలను విలీనం చేస్తూ.. గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. గోపాల్పూర్, దుర్శెడు, మల్కాపూర్, బొమ్మకల్. చింతకుంట గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేశారు. అయితే ఇవన్నీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామాలే.. ఈ గ్రామాలను కరీంనగర్ లో విలీనం చేయడంతో.. ఉపాది హామీ ఆగిపోనుంది. అదే విధంగా పన్నులు పెరగనున్నాయి. దీంతో బాధిత గ్రామ ప్రజలు భయపడుతున్నారు.
గతంలో విలీనమైన గ్రామాలే అభివృద్ధి చెందలేదు. అక్కడ పన్నులు చెల్లించలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ ఐదు గ్రామ ప్రజలు.. విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తమకు ఈ ఎన్నికలు వద్దని.. పంచాయతీ ఎన్నికలే కావాలని కోరుతున్నారు. అంతేకాకుండా.. కొంత మంది ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని చెబుతున్నారు.
నగరమంతా ఎన్నికల హడావిడి ఉంటే.. విలీన గ్రామాల్లో మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఎన్నికల హడావిడి కనబడటం లేదు. అంతేకాకుండా రాజకీయంగా కూడా వెనుకబడిపోతున్నామని నేతలు చెబుతున్నారు. రెండు గ్రామాలకు కలిపి ఒక్క కార్పొరేటర్ ఉండే అవకాశం ఉంది. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కూడా తక్కువే.. ఇటు ఆర్థికంగా అటు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నేతలు చెబుతున్నారు. గతంలో బాధిత గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఈ సమస్య నుంచి విముక్తి చేయాలని కోరుతున్నారు. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు. మొత్తానికి విలీన గ్రామస్తుల డిమాండ్ అధికార పార్టీకి ఇబ్బందిగా మారనుంది.
మా గ్రామాలను ఎట్టి పరిస్థితిలో.. కరీంనగర్లో కలుపవద్దని అంటున్నారు గ్రామస్తులు. పన్నులతో ఇతర సమస్యలను తట్టుకోవడం కష్టమని తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి విలీనం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.