Karimnagar Municipality: స్వేఛ్చ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని శర్మ నగర్ 44/53వ డివిజన్లో మున్సిపల్ దారికి సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సుమారు అర శతాబ్ద కాలంగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ఈ దారిని, కొందరు వ్యక్తులు తమ “తాత తండ్రుల ఆస్తి” అంటూ క్లెయిమ్ చేయడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న ఈ దారిలో సీసీ రోడ్డు నిర్మించి తమ ప్రయాణ కష్టాలు తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇంటి నెంబర్లు 6-6-154/ఎ నుండి 6-6-152/ఎ వరకు నివసిస్తున్న ప్రజలు తమ పూర్వీకుల కాలం నుండి ఈ 12 ఫీట్ల దారిని నిరంతరాయంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా కొందరు వ్యక్తులు ఈ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేసి దారిని మూసివేయడానికి ప్రయత్నించగా, మున్సిపల్ అధికారులు వాటిని రెండుసార్లు తొలగించారు. ఆ సమయంలో పోలీస్ సిబ్బంది సహకారంతో మున్సిపల్ యంత్రాంగం సీసీ రోడ్డు పనులను ప్రారంభించింది. ఇప్పటికే సగం వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే, మిగతా సగం రోడ్డు వేసే క్రమంలో ‘బైరామ్ రాజమ్మ & సన్స్’ పేరుతో మళ్లీ బోర్డులు వెలవడం, కోర్టు కేసు (O.S. No: 928/2025) పేరుతో అడ్డంకులు సృష్టించడంతో పనులు నిలిచిపోయాయి.
ప్రజా బాటగా మున్సిపల్ రికార్డుల్లో ఉండాల్సిన స్థలంపై, హఠాత్తుగా ప్రైవేటు బోర్డులు వెలవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 50 ఏళ్లుగా వాడుకలో ఉన్న దారిపై ఇప్పుడు హక్కులు కోరడం హాస్యాస్పదమని వారు అంటున్నారు. ఒకవైపు మున్సిపల్ అధికారులు గతంలో పనులు చేసినా, ఇప్పుడు సదరు వ్యక్తులు కేసుల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదమయంగా ఉన్న ఈ దారిలో నడవలేక వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాల్లో వాహనాలు లోపలికి రావడానికి కూడా వీలు లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు.
Also Read: Electricity Rules: ఇకపై రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్..?
ఎన్నికల ప్రక్రియ ముగియగానే పనులు పూర్తి చేయాలి. మధ్యలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సాంకేతికంగా రోడ్డు పనులు ఆగిపోయినప్పటికీ, ఎన్నికల ముగిసిన వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇప్పటికే సగం రోడ్డు వేసిన అధికారులు, మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి తమ చిరకాల వాంఛను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అది ప్రభుత్వ స్థలమా లేక ప్రైవేటు స్థలమా అనే విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అబ్దుల్ ఖాలిద్, దొడ్ల రవీందర్ తదితరులు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా నడుస్తున్న దారిని కొందరు స్వార్థపరులు తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని, దీనివల్ల వందలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని వారు వివరించారు. కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆగిపోయిన సీసీ రోడ్డు పనులను పునఃప్రారంభించాలని శర్మ నగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే, తమ గోడును వినిపించడానికి మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
Also Read: Soundarya Rajinikanth: కూలీ సినిమాపై రజనీకాంత్ కూతురు కామెంట్.. ఏంటీ దారుణం?