Electricity Rules: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లు పొందాలనుకునే వినియోగదారులకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్సీ) శుభవార్త చెప్పింది. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై, విద్యుత్ లైన్ వేయడానికి పట్టే దూరాన్ని బట్టి కాకుండా, వినియోగదారుడు తీసుకునే లోడ్ ఆధారంగానే సర్వీస్ లైన్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేశారు. కొత్త నిబంధనల ప్రకారంలో-టెన్షన్(ఎల్టీ) కనెక్షన్లకు సంబంధించి నిర్ణీత ప్రామాణిక చార్జీలు అమలులోకి రానున్నాయి.
20 కిలోవాట్ల వరకు లోడ్ ఉన్న వ్యక్తిగత కనెక్షన్లు, లేదా 20 కిలోవాట్ల వరకు కలిపి లోడ్ ఉన్న అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసి, ఏర్పాటు చేసి, నిర్వహించాల్సిన బాధ్యత పూర్తిగా డిస్కంలదేనని టీజీఈఆర్సీ స్పష్టంచేసింది. వాటి ఖర్చులను వినియోగదారుల నుంచి వసూలు చేయొద్దని నొక్కిచెప్పింది. అయితే 20 కిలోవాట్ల కంటే ఎక్కువ లోడ్ ఉన్న అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే, దాని పూర్తి ఖర్చును వినియోగదారులే భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ మార్గదర్శకాలు గురువారం నుంచి అమలవ్వనున్నాయి.
Also Read: Mega 158: చిరు మూవీలో దురంధర్ బ్యూటీ.. విలన్ గా బాలీవుడ్ నిర్మాత..?
లోడ్ సర్వీస్ లైన్ చార్జీలు
1 కిలోవాట్ వరకు రూ.500
1 కిలోవాట్-5 కిలోవాట్ రూ.500+ప్రతి కిలోవాట్ పై రూ.600 అదనం
5 కిలోవాట్-20 కిలోవాట్ రూ.2,900+ప్రతి కిలోవాట్ పై రూ.1,500 అదనం
20 కిలోవాట్, ఆపైన రూ.10,000 ప్రతి కిలోవాట్
ఇదిలా ఉండగా ఇతర కేటగిరీలైన ఎల్టీ-II, III, IV, V, IX పరిధిలోకి గృహేతర, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు వస్తాయి. ఇలాంటి లో-టెన్షన్ కేటగిరీలకు సైతం లోడ్ ఆధారంగా స్థిర చార్జీలను నిర్ణయించారు. ఉదాహరణకు, వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి కిలోవాట్ కు రూ.1,000 చొప్పున వసూలు చేస్తారు. కానీ రైతుల నుండి ఎటువంటి ఓఆర్సీ వసూలు చేయరని టీజీఈఆర్సీ స్పష్టంచేసింది. ఈ మార్పులు గృహ వినియోగదారులకు, రైతులకు ఉపశమనాన్ని కలిగించనున్నాయి.