Sarpanch Nomination: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27 నుంచి తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. కరీంనగర్ జిల్లాలో ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. రూపాయి విలువ తెలియాలని వెయ్యి రూపాయి నాణేలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువకుడు జంగిలి మహేందర్ వెయ్యి రూపాయి నాణేలతో నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో పాటుగా అందరికీ రూపాయి విలువ తెలియాలని తాను దాచుకున్న రూపాయి నాణేలు నామినేషన్ సెంటర్ కి వచ్చి రుసుము చెల్లించాడు. గతంతో ఒకసారి సర్పంచ్ ఎన్నికలలో వార్డు మెంబర్ గా పోటీ చేశానని మహేందర్ తెలిపారు. ఆ సమయంలో ఒక్క ఓటుతో తాను ఓడిపోయానన్నారు. ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని అందరికీ తన పేరు గుర్తుండాలనే రూపాయి నాణేలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ తెలిపారు.