Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం క్లైమాక్స్కు చేరుకుంది. గత నెల 24వ తేదీన ఇళ్లు గుడిసెలు కోల్పోయిన పేదల పోరాటానికి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిర్వాసితుల్లోని అర్హులైన వారిని ఎంపిక చేసి రేపు సాయంత్రం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇస్తామని చెప్పడం తమ దీక్షకు దక్కిన విజయమని పేర్కొన్నారు. అయితే మంత్రులు అధికారికంగా ప్రకటించే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని భీష్మించుక కూర్చున్నారు. కేవలం 70 లేదా 100 గజాల ఖాళీ స్థలం ఇస్తే సరిపోదని.. ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఉట్టి స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకోబోమని.. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఖమ్మంలో పేదవాడి ఇళ్లపై ప్రతాపం చూపిన అధికార యంత్రాంగం.. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోని ధనవంతుల ఇళ్లను ఇలాగే కూలుస్తారా అని కవిత ప్రశ్నించారు. కొంతమంది అక్రమంగా ఉంటున్నారనే నెపంతో వందలాది మంది పేదల ఇళ్లను నేలమట్టం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం 311 మందికి ఇళ్లు ఇస్తామంటోందని.. కానీ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అరెస్ట్ చేసిన 13 మంది బాధితులను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. రేపు మధ్యాహ్నం మంత్రులు నిర్వహించబోయే సమావేశంలో బాధితులకు ఇచ్చే ప్లాట్ల విస్తీర్ణం ఇళ్ల నిర్మాణంపై స్పష్టత రావాలని కోరారు.
ఇళ్లు కట్టిస్తారా లేదా అన్నది ప్రభుత్వం రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ లోపు ఖమ్మం నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పట్టాల పంపిణీ నిర్వహించే ప్రదేశాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. భూ నిర్వాసితులకు పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని మంత్రులు గతంలోనే ప్రకటించారు.
Read Also: Velugumatla: వెలుగుమట్ల బాధితుల పోరు ఫలించింది.. రేపు మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ!