Kavitha Kalvakuntla: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నిరాహార దీక్షను విరమించారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు నిమ్మరసం ఇచ్చి ఆమెతో పాటు విశారదన్ మహారాజ్ గారికి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం వెలుగుమట్లలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కనిపించడం లేదా అని కవిత ప్రశ్నించారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇళ్లను కూల్చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. పేదల ఇళ్లు కూల్చిన అధికారులపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మొదట ఆక్రమణలు అన్న ప్రభుత్వం.. ఇప్పుడు నిస్సిగ్గుగా అర్హులు ఉన్నారని చెబుతూ పట్టాలు పంపిణీ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన టోకెన్ల మీద తమకు నమ్మకం లేదని.. లేఅవుట్ తీసి ప్రతి కుటుంబానికి ఫిజికల్ ప్రాపర్టీ ఎక్కడుందో చూపించాలని ఆమె పట్టుబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.74 లక్షల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలు కేవలం ఒక ట్రయల్ మాత్రమేనని.. ఇక్కడ అడ్డంకులు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను కాజేసే కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. భూదాన్ భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను నిరుపేదలకే పంచుతామని ఆమె ప్రకటించారు. బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఒక ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ వేస్తామని.. ఆ నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
బాధితులకు అండగా నిలిచినందుకు జాగృతి కార్యకర్తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని కవిత కోరారు. వెలుగుమట్ల ఆడబిడ్డల చైతన్యం వల్లనే ప్రభుత్వం దిగివచ్చిందని.. తక్షణ న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం విరామం మాత్రమేనని.. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Kavitha: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ ఫిరాయించలేదా? ప్రభుత్వంపై కవిత ఫైర్