Kavitha: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం మరో పోరాటానికి వేదిక సిద్ధమైంది. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాట పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను ధారపోసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జులై 2న ఉప్పల్ భగాయత్ ముట్టడి
ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి విషయంలో ప్రభుత్వం తీవ్రంగా తాత్సారం చేస్తోందని కవిత మండిపడ్డారు. మాటలు చెప్పడం పక్కన పెట్టి, వెంటనే అర్హులైన ఉద్యమకారులను గుర్తించి భూములు కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేపట్టి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆమె బహిరంగంగా ప్రకటించారు.
తెలంగాణ స్ఫూర్తిపై కుట్రలను తిప్పికొడదాం
ప్రస్తుతం తెలంగాణలో కొన్ని శక్తులు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ, తెలంగాణవాదం మీద, ఇక్కడి స్ఫూర్తి మీద దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని కవిత ఆరోపించారు. అలాంటి శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన చారిత్రక కర్తవ్యం మనందరిపై ఉందన్నారు. ఈ భూపోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఉద్యమకారుల ఐక్యతను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
యువత, మహిళలకు ప్రత్యేక పిలుపు
తెలంగాణ సమాజం బాగుండాలి, రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలని నాడు ఉద్యమకారులు తమ జీవితాలనే త్యాగం చేశారని కవిత గుర్తుచేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. అందుకే ఈ పోరాటంలో ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. ఉద్యమకారులకు మంచి జరగాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా తరలివచ్చి జులై 2న జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read: కన్నతండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఉప్పల్ భగాయత్ భూముల స్వాధీనం చేసుకుంటాం: కవిత
ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్లో ‘ఉద్యమకారుల భూపోరాటం’ పోస్టర్ను ఆవిష్కరించిన ఆమె.. జులై 2న ఉప్పల్ భగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామని… pic.twitter.com/yEuvvBo785
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2026