హైదరాబాద్ శివారు నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి ఆమె శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్మెంట్స్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న ఈ వెంచర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయాలని చూస్తున్న రేవంత్ సర్కార్.. ఇలాంటి బడా వెంచర్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందని గట్టిగా ప్రశ్నించారు.
పేదల నివాసాలను నేలమట్టం చేసే హైడ్రాకు ఈ అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని కవిత నిలదీశారు. ప్రభుత్వ తీరు పక్షపాతంగా ఉందని ఆమె విమర్శించారు. ఒకవైపు సామాన్యుల గూడు చెడగొడుతూ.. మరోవైపు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి నాయకులు స్థానికులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో కేవలం పేదలనే టార్గెట్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్మెంట్స్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన
రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల… pic.twitter.com/gRNMejhbbw
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2026
గాంధీ సరోవర్ ప్రాజెక్టు ముసుగులో జరుగుతున్న అన్యాయాలను సహించబోమని కవిత హెచ్చరించారు. నార్సింగిలో మూసీ నది సహజ ప్రవాహానికి అడ్డుగా వెలుస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్మెంట్స్ వెంచర్ను వెంటనే అడ్డుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని.. పేదలకో న్యాయం బడా బాబులకో న్యాయం ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని కవిత ప్రకటించారు. మూసీ నదిని రక్షించాలన్న ఉద్దేశ్యం నిజంగా ఉంటే.. ముందుగా ఇలాంటి భారీ ఆక్రమణలపై బుల్డోజర్లను నడపాలని సవాల్ విసిరారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఆక్రమణలకు గురైన నది భూములను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు విశ్రమించబోమని వారు స్పష్టం చేశారు.