Kavitha Resignation: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కవిత రాజీనామాను ఛైర్మన్ ఆమోదించడం వెనుక అసలేం జరిగింది? పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో తన రాజీనామా కవిత ఓకే చేయించుకున్నారా? ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడంతో ఆ సీటు కోసం మంత్రి అజారుద్ధీన్ రేసులో ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా, ఛైర్మన్ ఆమోదం
తెలంగాణలోని బీఆర్ఎస్లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నేతలు అవినీతిపై కవిత ఎదురుదాడి చేయడంతో బీఆర్ఎస్ నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కవిత కలిశారు. దాదాపు అరగంటపాటు ఆయనతో చర్చించారు. తన రాజీనామాను అంగీకరించాలని కోరారు.
మరుసటి రోజు మండలిలో భాగోద్వేగంతో కవిత మాట్లాడడం, అందుకు సంబంధించి పరిణామాలు క్లియర్గా వివరించారు. మంగళవారం కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దాన్ని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించడం చకచకా జరిగిపోయింది. ఈ మేరకు మండలి కార్యదర్శి నర్సింహాచారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్సీ సీటు రేసులో మంత్రి అజారుద్దీన్
బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కవిత రాజీనామాను ఛైర్మన్ ఆమోదించారనే వార్తలు లేకపోలేదు. పదే పదే బీఆర్ఎస్ నేతల అవినీతి గురించి విమర్శలు ఎక్కుపెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి ఆమె ఎమ్మెల్సీ పదవి 2028 వరకు ఉంది. ఉగాదికి ముందుగానీ, ఆ తర్వాత కవిత రాజకీయ పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆమె తన రాజీనామా ఆమోదించుకుంటున్నారని అంటున్నారు. కవిత జోరు పెంచితే బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పవనే వాదన లేకపోలేదు. ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుందని చాలామంది నేతల అంచనా. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి గురించి ఆమె ప్రధానంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
ALSO READ: పిల్లల్ని పక్కింటి వాళ్లతో పోల్చకండి.. ఒత్తిడికి అదే కారణం
కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఉప ఎన్నిక కీలకమైంది. ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ముందు మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు.
ఆరు నెలలలోపు ఆయన తన ఎన్నిక కావాల్సివుంది. ఈలోగా కవిత రాజీనామా చేయడంతో మంత్రి అజారుద్దీన్ మండలికి ఎన్నికయ్యే ఛాన్స్ ఉందని అధికార పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కవిత రాజీనామా మంత్రి అజారుద్దీన్కు ఈ విధంగా కలిసొచ్చిందని కొందరి నేతల మాట.