Kalvakuntla Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు తెలంగాణ జాగృతి చీప్ కల్వకుంట్ల కవిత. తన వైపు సత్యం ఉండటం, ఆపై దేవుడి దయతో బయటపడ్డానని తెలిపారు. గురువారం రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమలకు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఒకటి. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, తెలంగాణ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసింది ఈడీ. హైదరాబాద్ నుంచి నేరుగా ఆమెని ఢిల్లీకి తరలించారు. దాదాపు 140 రోజులు పైగానే ఆమె జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
రీసెంట్గా ఈ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు ఇవ్వడంతో కీలకమైన వ్యక్తులు బయటపడ్డారు. అరెస్టయిన సమయంలో కవిత తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు. దాన్ని తీర్చేందుకు ఆమె తన కుటుంబసభ్యులతో గురువారం తిరుమల వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెకు మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.
రేణిగుంట ఎయిర్పోర్టులో మీడియాతో కవిత
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసు పెట్టి తనను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని అన్నారు. కానీ సత్యం నా వైపు ఉండటంతో దేవుడి దయతో ఆ కేసును నుంచి బయటపడినట్టు తెలిపారు. వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని, కాలి నడకన స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు.
కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవటానికి వచ్చామని వెల్లడించారు. ఏపీలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల
రేణిగుంట నుంచి కారులో తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి కాలినడక మార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకోనున్నారు కవిత కుటుంబసభ్యులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలకు వస్తున్న సందర్భంగా ఆమె స్వాగతం పలుకుతూ తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంటలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మద్దతుదారులు.