Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగరంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం, డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీకి తెరతీసిందని, హైదరాబాద్పై కాంగ్రెస్ మార్క్ దోపిడీకి తెరదీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. క్యూర్ పేరుతో ప్రజలకు పెయిన్ తీసుకొస్తున్నారంటూ ఆయన విమర్శించారు. 1955 నాటి మున్సిపల్ చట్టంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే క్యూర్ చట్టంలోని కీలక నిబంధనలు ప్రజలను పీల్చి పిప్పిచేసేలా ఉన్నాయని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
సైంటిఫిక్ ట్యాక్సేషన్ విధానం లేకుండా, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఆధారంగా ప్రతి సంవత్సరం 5 శాతం వరకు పన్నులు పెంచేలా నిబంధనలు పెట్టడం ముమ్మాటికీ పన్నుల దోపిడీయేనని విమర్శించారు. నీరు, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరు పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి స్పష్టత లేకుండా, జవాబుదారీతనం లోపించిన ఈ చట్టాన్ని తాము అసెంబ్లీలో తీవ్రంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. భాగస్వాములైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రజల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా ఈ చట్టం తీసుకురావాలనుకోవడం సరైనది కాదని హితవు పలికారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల సంక్షేమం కోసం కాదని, అది మరొక ఆర్థిక దోపిడీ కార్యక్రమమని దుయ్యబట్టారు. 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉంటే, కేవలం 7,680 ఫ్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి, ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.100 రుసుముతో పాటు రూ.10,000 ఈఎండీ డిపాజిట్ వసూలు చేయడం అత్యంత అన్యాయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పేదల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నిందని, ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తోందని విమర్శించారు. గత వైఎస్సార్ పాలనలో నిర్మించిన సద్భావన, అభిమాన్(జవహర్నగర్), పోచారం, చందానగర్, సహీరా(గాజులరామారం) టౌన్షిప్లతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో బోలక్పూర్, జవహర్నగర్లలో నిర్మించిన వందలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా పడి ఉన్నాయని గుర్తు చేశారు.
Also Read: NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!
రాజీవ్ స్వగృహ ఇళ్ల అవకతవకలపై సీబీసీఐడీ విచారణ జరుపుతామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందని, ఇలా గతంలో కట్టిన ఇళ్లను మరమ్మతులు చేసి పేదలకు ఇవ్వకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను వాడుకుంటూ, రూ.11 లక్షల ఇల్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందని, ప్రభుత్వం వెంటనే గతంలో నిర్మించిన ఇళ్లను ఉచితంగా అర్హులకు కేటాయించాలని, పాత ఇళ్లు పంపిణీ కాకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సైనిక్ పురికి చెందిన ప్రముఖ సేవా నిర్వాహకులు జాయ్ మైఖేల్ డిసాజ్వా, ఓల్డ్ బోయన్ పల్లికి చెందిన వ్యాపారి దినేష్ కుమార్, కూకట్ పల్లికి చెందిన వ్యాపారవేత్త శ్రావణ్ కుమార్ సామలతో పాటు తదితరులున్నారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!