కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రచార గడువు ముగియనున్న తరుణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. ట్విట్టర్ వేదికగా ఒక సంచలన వీడియోను విడుదల చేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు కేరళపై కన్నేసిందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేరళలో కాంగ్రెస్ కొత్త డ్రామా.. ఆరు గ్యారెంటీలు అమలేవీ..?
తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అటకెక్కాయని కవిత విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. రైతు సంక్షేమం పూర్తిగా విస్మరణకు గురైందని.. కనీసం రైతు భరోసా నిధులు కూడా సకాలంలో అందక సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే స్క్రిప్ట్తో కేరళ ప్రజలను మభ్యపెట్టడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు.
కేరళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలే.. కవిత కీలక సూచన
తెలంగాణలో అమలవుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని కవిత పేర్కొన్నారు. అక్కడ విఫలమైన నమూనాను పట్టుకొని కేరళలో ప్రచారం చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో రేవంత్ రెడ్డి కొత్త తరహా మోసాలకు తెరలేపారని హెచ్చరించారు. కేరళ ప్రజలు విజ్ఞులని.. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆమె కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ మాదిరిగా కేరళ ప్రజలు కాంగ్రెస్ పాలనలో బాధితులుగా మారకూడదని ఆమె ఆకాంక్షించారు.
నిరూపిత నాయకత్వానికే పట్టం కట్టండి..
కేరళ అభివృద్ధి పథంలో సాగాలంటే పినరయి విజయన్ వంటి బలమైన నాయకత్వం అవసరమని కవిత స్పష్టం చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధించిన విజయాలను.. కేరళలో జరుగుతున్న అభివృద్ధిని ఆమె కొనియాడారు. ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం కంటే.. ఇప్పటికే నిరూపించుకున్న నాయకత్వాన్ని బలపరచడం శ్రేయస్కరమని సూచించారు. రేవంత్ రెడ్డి విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప.. అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కేరళ ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. అభివృద్ధికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
The @INCIndia and @RahulGandhi cheated Telangana. People of Telangana were promised "6 Guarantees" but got ghosted. Now, @revanth_anumula is bringing that same script to Kerala.
From farm loan waivers to job creation to farmer welfare, literally all of his promises in Telangana… pic.twitter.com/CKqeCGRnPZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2026