Kalyana Lakshmi Fraud: ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అక్రమార్కులు తమ స్వార్ధానికి ఎలా వాడుకుంటున్నారో తెలిపే విస్తుపోయే ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. అర్హులైన వారికి అందాల్సిన నిధులను నకిలీ పత్రాలతో కాజేస్తూ ప్రభుత్వానికే టోకరా వేస్తున్నారు. ముఖ్యంగా మీ-సేవ కేంద్రాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ తండాకు చెందిన హేమా, వినోద దంపతులకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. హేమా మరిపెడ మండల కేంద్రంలో మీ-సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకం కింద వచ్చే రూ. 1,00,116 నగదుపై కన్నేసిన హేమా, తన భార్య వినోదకు నాగు అనే యువకుడితో రెండో పెళ్లి జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ పత్రాలతో పథకానికి దరఖాస్తు చేసి ప్రభుత్వం నుండి లబ్ధి పొందాడు.
హేమా కేవలం తన భార్య పేరుతోనే కాకుండా, మరికొందరి పేర్లతో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. మీ-సేవ కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజల పత్రాలను సేకరించి, వాటితో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి తన బంధువుల పేరిట నిధులు కాజేశాడు. ఒక పథకంలో తన భార్యను వధువుగా చూపించిన హేమా, మరో దంపతుల దరఖాస్తులో ఆమెను వధువు తల్లిగా చూపిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. ఈ విధంగా నకిలీ పత్రాల ద్వారా రెండు సార్లు చెక్కులు పొంది మొత్తం రూ. 2,00,232 సొమ్ము చేసుకున్నాడు.
కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్ పథకాల్లో లబ్ధిదారుల పేర్లకు, ఆధార్తో అనుసంధానం (Link) సరిగ్గా లేకపోవడాన్ని హేమా అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ లొసుగులను ఉపయోగించుకుని అధికారుల కళ్లు గప్పి ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా దోచుకున్నాడు. అయితే, ఈ అక్రమ భాగోతం చివరకు బయటపడటంతో జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: