Rajender Reddy: వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మరోసారి కాక రేపుతోంది. ఈ ప్రాజెక్టు క్రెడిట్ తమదేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేయవద్దని ఆయన హెచ్చరించారు.
కోచ్ ఫ్యాక్టరీ గురించి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాయిని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చి.. దానికి పునాది వేసింది సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. మొదట 54 ఎకరాల భూసేకరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ ‘సంసారం’ చేసిందని ఆ సమయంలో కాజీపేట ప్రయోజనాలను ఎందుకు కాపాడలేదని నాయిని ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు?’ అని నిలదీశారు. కాజీపేటను అభివృద్ధి చేయాల్సింది పోయి దానిని అణగదొక్కిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆయన ఆరోపించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలని తాము జేఏసీ నేతలతో కలిసి పోరాడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు.
రాజకీయ విమర్శలతో పాటు వరంగల్ నగర భద్రతపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. నగరంలో ప్రస్తుతం దొంగల ముఠాలు, పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయని సమాచారం ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.