Duplicate Voters: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఏప్రిల్ నుంచి నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దటంతో పాటు ప్రక్షాళన చేయటంలో భాగంగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ విభాగం అధికారులు ఓటరు జాబితాను వడపోసేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ)లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒకే వివరాలతో రెండు చోట్ల ఓటరు వివరాలున్న సుమారు లక్షా 2 వేల మంది ఓటర్లను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ప్రక్రియకు సమాంతరంగా 2002 ఓటరు జాబితా, 2025 ఓటరు జాబితాతో పోల్చుతూ మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 2002 ఓటరు జాబితాలోని వివరాలను 2025 ఓటరు జాబితాలోని వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ మ్యాపింగ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?
ఒకే వివరాలతో రెండు చోట్ల, అంతకన్నా ఎక్కువ సార్లు ఓటు హక్కును కల్గి ఉన్న సుమారు లక్షా 2 వేల ఓటర్లకు మొదటి నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఇలా ఓటర్లకు వరుసగా మూడు నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఓటరు స్పందించకుంటే సదరు ఓటు వివరాలను డిలీట్ చేయనున్నట్లు సమాచారం. నిర్ణీత గడువును విధిస్తూ వరుసగా మూడుసార్లు వచ్చే ఈ నోటీసులకు స్పందించి, ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదై ఉన్న ఓట్లలో ఒకదాన్ని ఓటరు ఎంపిక చేసుకుని కోరుకుంటే, మిగిలిన రెండు ఓట్ల వివరాలను ఫారమ్,-7 ద్వారా డిలీట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదై ఉన్న ఓట్ల వివరాలు, బ్లర్ ఫొటోలు, సమాచారంలో సవరణ వంటి అంశాలకు సంబంధించి బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను త్వరలోనే ముమ్మరం చేసి, రిపీటెడ్ ఓట్లను, ఒకే ఇంటి నెంబర్ పై బల్క్ లో ఉన్న ఓట్లను గుర్తించనున్నట్లు తెలిసింది.
Also Read: Harish Rao: విశాఖ తరహాలో.. ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలి.. రేవంత్దే బాధ్యత