Telangana Politics: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల సందడి మొదలైందా? ప్రధాన రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయా? ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారా? తమ తమ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఈసారైనా కేసీఆర్ యాక్టివ్ అవుతారా? ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, కేసీఆర్ మాస్టర్ ప్లాన్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు తమతమ నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్ పాత్ర కీలకంగా మారనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తోంది.
అందుకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఆ ఓటు బ్యాంక్ను సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
నేతలకు అందుబాటులో కేసీఆర్
గడిచిన రెండేళ్లుగా ఎర్రవల్లి ఫామ్హౌస్కి పరిమితమయ్యారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలకు పంచాయతీ సర్పంచ్లు కీలకం కావడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్ఛార్జులకు సంకేతాలు వెళ్లినట్టు పార్టీ వర్గాల మాట. డిసెంబర్ మొదటివారంలో ఫామ్హౌస్ నుంచి నందినగర్కు మాజీ సీఎం మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ నందినగర్లో ఉంటారని తెలుస్తోంది. అంతేకాదు జిల్లాలు, నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలకు తెలంగాణ భవన్లో ఆయన అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. దీనివల్ల జిల్లాల నుంచి వచ్చే నేతలకు ప్రత్యేకంగా సమయం కేటాయించి, వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని భావిస్తున్నారట.
ALSO READ: తెలంగాణలో మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
తెలంగాణ భవన్లో కేసీఆర్ అందుబాటులో ఉంటే నేతలు, కేడర్కు మాంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. ఆయన ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్నది కొందరి నేతల మాట. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కచ్చితంగా గెలిపించాలని ఇప్పటికే పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సంకేతాలు వెళ్లినట్టు చెబుతున్నారు.
పార్టీ పెట్టిన మొదట్లో ఎలాగైతే సత్తా చాటామో.. ఇప్పుడు అదే పంథాను అనుసరించాలని చెప్పినట్టు సమాచారం. పార్టీ బలపడేందుకు సర్పంచ్ ఎన్నికలను అస్త్రంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది కారు పార్టీ. ఇంతవరకు బాగానే ఉంది. మరి కేసీఆర్ ఇప్పుడైనా పార్టీ ఆఫీసుకు వస్తారా? కేవలం ఫీలర్లకు మాత్రమే పరిమితమవుతారా? ఆయన యాక్టివ్ కాకుంటే కష్టమేనన్నది కొందరు నేతల వాదన.