CM KCR news today(Telangana today news) : ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాధిపతులు ఒకేచోట పనిచేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకోసం సచివాలయం సమీపంలో జంట సౌధాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హెచ్ఓడీ అధికారులు తరచూ సచివాలయానికి రావాల్సిన అవసరం ఉంటుంది. వారి కార్యాలయాలు సచివాలయానికి దగ్గరగా ఉంటే బాగుంటుందని సీఎం భావించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు, వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సెక్రటేరియట్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాలపై ఆరా తీశారు. స్థల నిర్ధారణ జరిగిన తర్వాత ట్వీన్ నిర్మాణాన్ని చేపడతామని సీఎం తెలిపారు. అలాగే కొత్త సచివాలయంలో అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. వసతుల గురించి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరుల స్మారకాన్ని కేసీఆర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. రోడ్లు భవనాలశాఖ ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహానికి 2 వైపులా ఫౌంటేన్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. బీఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనలను సీఎం పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కేసీఆర్ మరోసారి దిశానిర్దేశం చేశారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలపై ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను సీఎస్ శాంతికుమారి.. సీఎం కేసీఆర్కు వివరించారు.
బీసీ, ఎంబీసీలలో కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని కేసీఆర్ హామీఇచ్చారు. వీరికి రూ. లక్ష చొప్పున దశలవారీగా ఆర్థికసాయం అందిస్తామన్నారు. విధి విధానాలను మరో 2 రోజుల్లో ఖరారు చేస్తామని సబ్కమిటీ ఛైర్మన్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. త్వరగా విధివిధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.