Raghunandan : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేసింది. అవుటర్ రింగ్ రోడ్డు లీజును పొందిన ఆ సంస్థపై ఆరోపణలు చేసినందుకు లీగల్ నోటీసులు పంపింది.
ఐఆర్బీ సంస్థ పరువునష్టం దావాలో రఘనందన్ రావు చేసిన ఆరోపణలను ప్రస్తావించింది. ఈ నెల 25న రఘునందన్రావు ఐఆర్బీ సంస్థపై విమర్శలు గుప్పించారు. ఉద్యమం చేసేవారిని ఐఆర్బీ చంపేస్తుందన్నారు. తమ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఐఆర్బీ తెలిపింది. ఈ వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నాయని తెలిపింది.
గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యకేసుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఐఆర్బీ స్పష్టం చేసింది. పుణె సెషన్స్ కోర్టు, ముంబై హైకోర్టు ఈ కేసులో క్లీన్చిట్ ఇచ్చాయని వివరించింది. వాస్తవాలు తెలుసుకోకుండా సంస్థ పరువును దెబ్బతీసేలా రఘునందన్రావు మాట్లాడారని తెలిపింది. ఐఆర్బీ ఇన్ఫ్రాను బ్లాక్లిస్టులో పెట్టారనే వ్యాఖ్యలు నిరాధారమైనవని , పలు జాతీయ ప్రాజెక్టుల్లో పెట్టుబడి భాగస్వామిగా ఉన్నామని వెల్లడించింది. ఎక్కడా బ్లాక్లిస్టులో పెట్టలేదని పేర్కొంది.
రఘునందన్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తమ సంస్థ పరువుకు తీవ్ర భంగం కలిగిందని పేర్కొంది. ఇందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. లేదంటే రూ. వెయ్యి కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని స్పష్టం చేసింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.