KCR On Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ఇన్నాళ్లూ ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఆ వార్తలను పటాపంచలు చేశారు. ముందస్తు ముచ్చట లేదని తేల్చేశారు. యథావిథిగానే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహాన్ని కేసీఆర్ ప్రకటించేశారు.
ఎమ్మెల్యేలకు టాస్క్ ఇదే
నియోజకవర్గాల్లో తిరగాలని ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు. టిక్కెట్లు అందరికీ ఇస్తామని ప్రకటించారు. అంటే అన్ని చోట్ల తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తారా? ఈ ఏడాది పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుని ఇస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలను ప్రజల్లో తిరగమన్నారు. ప్రభుత్వ, సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలు ఎమ్మెల్యేల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. అంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాత మళ్లీ సర్వేలు చేయించి ఎవరి టిక్కెట్లు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎమ్మెల్యేలను ప్రజల సమస్యలు తెలుసుకోమన్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మన్నారు. అంటే ఆయా ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో కేసీఆర్ తెలుసుకుంటారు. పనితీరు ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన నేతలను పక్కపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. అందుకే జనంలోకి వెళ్లిమన్నారు.
వచ్చే 6నెలలే కీలకం
ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉండి వచ్చే 6 నెలల్లో నియోజకవర్గంలో సరిగ్గా తిరగని నేతలకు టిక్కెట్లు దక్కకపోవచ్చు. అదే సమయంలో కాస్త వ్యతిరేకత ఉండి..వచ్చే 6 నెల్లల్లో నియోజకవర్గంలో బాగా తిరిగితే అలాంటి నేతలకు టిక్కెట్ల ఇచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉంది. ఇప్పటికే అలాంటి నేతల పేర్లను కేసీఆర్ సిద్ధం చేసే ఉంటారు. వాళ్లు ఏం చేసినా టిక్కెట్ కచ్చితంగా రాదు. ఈ మూడు కేటగిరీల్లో నేతల జాబితాను ఇప్పటికే కేసీఆర్ సిద్ధం చేసి ఉంటారు. కచ్చితంగా గెలుస్తారన్న నేతలకు వచ్చే 6 నెలలతో పనిలేదు. చివరి 6 నెలలే కీలకం . ఈ జాబితాను కేసీఆర్ రెడీ చేసుకునే ఉంటారు. అందరికీ టిక్కెట్లు ఇస్తామని ఒక ప్రకటన మాత్రమే కేసీఆర్ వదిలారు. టిక్కెట్ గ్యారంటీ అని నిర్లక్ష్యంగా ఉంటే వారికి గులాబీ బాస్ నుంచి షాక్ తగలవచ్చు. ప్రస్తుతం టీజర్ మాత్రమే కేసీఆర్ వదిలారు. అసలు సినిమా 6 నెలల తర్వాతే మొదలవుతుంది.
వ్యూహం ఇదే
ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. అంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళతారనే వార్తలు వచ్చాయి. మునుగోడు ఫలితం తర్వాత వెనక్కితగ్గి ఉంటారు. అయితే 6 నెలల తర్వాత సమీకరణాలు మారతాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అందరికీ టిక్కెట్లు ఇస్తామంటే ఎవరూ పార్టీ మారే సాహసం చేయరు. టిక్కెట్లు ఇచ్చేది ఎలాగూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే. ముందే నేతలు జారుకుంటే పార్టీ గెలుపుపై నమ్మకం పోతుంది. నేతలు వలసలకు బ్రేకులు వేసేందుకు కేసీఆర్ సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు అని ప్రకటించేశారు. కేసీఆర్ వ్యూహం ప్రకారమే ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.