Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో ప్రారంభమైన ఈ విచారణ సుదీర్ఘంగా 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగింది. సిట్ (SIT) అధికారులు కేసీఆర్ ముందు కీలక ఆధారాలను ఉంచి విచారించినట్లు సమాచారం.
ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందం కేసీఆర్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ బృందంలో ఐపీఎస్ అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నారు. కేసీఆర్ నివాసంలోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ గదిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి 7:50 గంటల వరకు కొనసాగింది. విచారణాధికారులు తమ వెంట తెచ్చుకున్న కంప్యూటర్లు, ఆపరేటర్ల సహాయంతో కేసీఆర్ ఇచ్చిన సమాధానాలను ఎప్పటికప్పుడు స్టేట్మెంట్గా నమోదు చేశారు.
ఈ విచారణలో సిట్ అధికారులు కేసీఆర్ ముందు అనేక ఆధారాలను ఉంచినట్లుగా తెలిసింది. గతంలో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. ఎస్ఐబీ (SIB) కార్యాలయంలో ధ్వంసమైన డేటాకు సంబంధించి మరియు ట్యాపింగ్ జరిగిన సమయాల్లో ముఖ్య నేతలతో జరిగిన కమ్యూనికేషన్పై వివరణ కోరినట్లుగా.. విదేశాల నుంచి వచ్చి విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారాన్ని కూడా కేసీఆర్ ముందు ఉంచి విచారించినట్లు తెలుస్తోంది.
విచారణ ముగిసిన అనంతరం అధికారులు నందినగర్ నుండి వెళ్లిపోయారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విచారణ మధ్యలో విరామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుండి వచ్చాయి? నిధుల సేకరణకు, రాజకీయ నిఘాకు ఈ వ్యవస్థను వాడారన్న ఆరోపణలపై కేసీఆర్ ఇచ్చిన వివరణలను సిట్ అధికారులు విశ్లేషించనున్నారు. ఈ విచారణ నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
ఈరోజు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇటీవల విచారణకు హాజరైన ప్రభాకర్ రావు స్టేట్మెంట్లతో పోల్చి చూస్తారు. ఒకవేళ కేసీఆర్ చెప్పిన విషయాలకు, మిగిలిన వారు చెప్పిన విషయాలకు మధ్య వైరుధ్యం (Contradictions) ఉంటే, ఆ వివరణ కోరడానికి మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది.