Palla Rajeshwar Reddy: తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని వేధించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమా అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ను సిట్ ఫోన్ ట్యాపింగ్ ఆంశంలో నందినగర్లో విచారించిన నేపథ్యంలో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు జనగమ పట్టణంలో నల్ల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సాధించి, పదేళ్ళు పాలించి, అభివృద్ది చేసిన కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఒక ఉద్యమకారుడిని సిట్ విచారణ పేరుతో పిలవడం అవమానించడమే అని అన్నారు. సిట్లతో, కేసులతో కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని, తెలంగాణ ఉద్యమకారులను ఏమి చేయలేరని అన్నారు. అక్రమ అరెస్టులు, కేసులతో బీఆర్ఎస్ను విచ్చిన్నం చేయాలంటే అది ఎవ్వరి వల్ల కాదన్నారు.కేసీఆర్ను విచారించడం కేవలం కక్షసాధింపు చర్యే అని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా, విచారణలు చేసినా భయపడేది లేదన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కేఆర్ ను సిట్ విచారించిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని శివాజీ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ నాటకం ఆడుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలనే ఎత్తుగడలో భాగంగానే ఇలా సిట్ పేరుతో నాటకాలు ఆడుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, విచారణలు చేసిన బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు.
Also Read: Basit Ali: ఈ కాటేరమ్మ కొడుకుల నుంచి పాక్ ను కాపాడాలంటే, ఆ అల్లా దిగిరావాల్సిందే