KCR On CBN: ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు చేసిన ద్రోహమని మండిపడ్డారు. అప్పటి సీఎం చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని, చాలా పునాది రాళ్లు వేశారన్నారు. ఆ పునాది రాళ్లను కృష్ణా నదిలో వేస్తే చెక్ డ్యామ్ అవుతుందని ఉద్యమ సమయంలో తాను అంటే నవ్వుకునేవారన్నారు.
సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అంటూ అప్పట్లో చంద్రబాబు స్లోగన్ ఇచ్చారని కానీ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. జూరాల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కొంత కర్ణాటకలో ఉందని, ఆ రాష్ట్రానికి రూ.13 కోట్లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించనని, దాంతో చంద్రబాబు మోకాళ్లపై పరుగులు పెట్టి కాంపన్సేషన్ కట్టారన్నారు. అప్పట్లో ఆర్డీఎస్ కోసం తాను గొడవ చేస్తే.. జూరాలకు లింక్ కెనాల్ స్టార్ చేశారన్నారు.
“కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు శనిలా దాపరించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కావాల్సిన అనుమతులు కూడా తెచ్చాం. 8 అనుమతుల్లో 6 వచ్చాయని.. కానీ ఇంతలో కేంద్రంలోని బీజేపీ చంద్రబాబు మాటలు పట్టుకుని డీపీఆర్ వెనక్కి పంపింది. డీపీఆర్ వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటించింది”- కేసీఆర్
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కాలువతో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఉంటే బాంబులు పెట్టి పేల్చివేశారని కేసీఆర్ ఆరోపించారు. ఈ అన్యాయాన్ని బయటపెట్టడానికి అప్పట్లో తాను జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టానని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ సమయంలో జూరాల – ఆర్డీఎస్ లింక్ కెనాల్ పేరుతో చంద్రబాబు డ్రామా చేశారన్నారు. కానీ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదన్నారు.
Also Read: Uttam Kumar Reddy: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. పదేళ్లు సీఎంగా ఏం చేశారు.. కేసీఆర్ కు ఉత్తమ్ కౌంటర్
తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, ఉమ్మడి పాలకులు వెనక్కి నెట్టివేసిన ప్రాంతం అని తాను ఉద్యమ ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ వివక్షకు ముగింపు పడిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులని వంట మనుషులతో ఫేక్ ఏంవోయూలు చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ ఏంవోయూలకు ఆజ్యుడు ఆయన గురువు చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. ఫేక్ ఏంవోయూతో పెట్టుబడులు వస్తాయంటే ఆంధ్రాలో ఇప్పటి వరకే రూ.20 లక్షల కోట్లు రావాలన్నారు.