మాజీ సీఎం, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి సీరియస్ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తాజాగా ప్రత్యేకంగా నజర్ పెట్టారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇకమీదట జరగకూడదని పార్టీ నేతలకు అల్టీమేటం జారీ చేసినట్టు తెలుస్తున్నది.ఏదైనా పార్టీ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని సీనియర్లకు సైతం సంకేతాలు పంపినట్టు సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.రాబోయే రోజుల్లో సరికొత్త బీఆర్ఎస్ పార్టీని చూడబోతున్నారని కిందిస్థాయి కార్యకర్తలు, నేతలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ నేతృత్వంలో స్టేట్ లీడర్ షిప్ మినహా జిల్లా, మండలస్థాయి కమిటీలను రద్దు చేస్తూ బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వచ్చే జూన్ నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.సభ్యత్వాన్ని డిజిటల్ మోడ్,ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.సభ్యత్వ నమోదులోనూ ఓ ప్రామాణికత పాటించాలన్నారు. ఎవరికి పడితే వారికి కాకుండా పార్టీ భవిష్యత్ గురించి ఆలోచించి పార్టీకి పనికొచ్చే వారిని చేర్పించాలన్నారు. పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేయాలని, సభ్యత్వం కోసం ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కమిటీల పునర్నియామకం ఉంటుందని తెలిపారు.గ్రామం,మండలం, జిల్లా స్థాయిలో కొత్త కమిటీలను వేసుకుందామని చెప్పారు.
ఆ తర్వాత ఎన్నికైన కార్యవర్గంతో పెద్ద ఎత్తున సభ ఉంటుందని తెలిపారు. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీల సభ్యత్వానికి రూ.50 రుసుమును నిర్ణయించినట్టు తెలిపారు.అందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని పార్టీ సీనియర్లను ఆదేశించారు.అనుబంధ సంఘాలను సైతం పటిష్టం చేయాలని కేసీఆర్ సూచించారు.
ప్రచార పిచ్చితో యాంకర్లకు కోట్లు తగలేశారు.. కేటీఆర్ పై చామల కిరణ్ ఫైర్
రజతోత్సవ వేడుకల్లో భాగంగా కేసీఆర్.. కొందరు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.పార్టీ లైన్ దాటితే సిట్టింగ్లకు కూడా సీట్లు ఇవ్వనని హెచ్చరించారు.సోషల్ మీడియాలో చేసే డ్రామాలు పనిచేయవని..వాటిని వెంటనే ఆపాలన్నారు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కమిటీలు వేయడంలో చురుకైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.నచ్చినవాళ్లకు పోస్టులు ఇచ్చారని ఫిర్యాదులు రాకూడదని, వస్తే వాటిని తానే పరిశీలిస్తానని చెప్పారు. ఆ వెంటనే వారిపై చర్యలు ఉంటాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.కొందరు నాయకులు ఇంకా అహంకారంతో వెళ్తున్నారని..అందరినీ కలుపుకుని పోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.ఇటీవల కొందరు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో వారిపైనా పరోక్షంగా కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఈసారి పనిచేసే వారికే టికెట్, కొత్తవారికి కమిటీల్లో చోటు ఇవ్వడంతో వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడతారని కేసీఆర్ భావించినట్టు తెలుస్తున్నది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మీద వ్యతిరేకత రావడానికి కొందరు జిల్లా, మండల స్థాయి నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కారణమని తెలుసుకున్న గులాబీ బాస్.. వచ్చే ఎన్నికల్లో వారికి మొండిచేయి చూపిస్తారని టాక్ నడుస్తోంది.